మల్లెందొడ్డి గ్రామంలో సమస్యల తిష్ఠ
- సిసి రోడ్లు లేక రోడ్లపైనే నిలిచిన మురుగు.
- సమస్యలను పట్టించుకోని పాలకులు,అధికారులు.
- గ్రామ సమస్యలపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం...
- నడిగడ్డ హక్కుల పోరాట సమితి గ్రామ అధ్యక్షుడు సుదర్శన్ నాయుడు.
జోగులాంబ గద్వాల 27 ఆగస్టు 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : మల్దకల్: మండలంలోని మల్లెందొడ్డి గ్రామంలో 10 సంవత్సరాల నుండి సమస్యలు తిష్ట వేశాయని ఓట్ల కోట్ల సమయంలో ఇండ్ల ముందర కొచ్చి ఓటు అడిగి అధికారాన్ని పొందుతున్నా, కష్టకాలంలో ప్రజల సమస్యలను పట్టించుకునే నాధుడే కరువయ్యారని నడిగడ్డ హక్కుల పోరాట సమితి గ్రామ అధ్యక్షుడు సుదర్శన్ నాయుడు విమర్శించారు. చిత్తశుద్ధి లేని ప్రభుత్వం కేవలం ఓట్లు దండుకునే ప్రయత్నమే తప్ప సమస్యను పరిష్కరించే ప్రభుత్వం కాదని అధికారులు మొద్దు నిద్రను వీడి ఇలాంటి సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. బీసీ కాలనీలో సీసీ రోడ్డు లేక తాత్కాలిక రోడ్డుపై మురుగు పారుతున్నా పాలకులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, ప్రజల సమస్యలపై అలాగే గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించుటకై త్వరలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.