జాతీయ బాలికల దినోత్సవం మొ క్కుబడి ఐతే అవసరమే లేదు
జాతీయ బాలికల దినోత్సవం మొ క్కుబడి ఐతే అవసరమే లేదు
ఉన్మాద కీచకుల భరతం పట్టడానికి సమాజం ఉక్కుపాదం మోపితేనే దానికి అర్థం
ఆడపిల్లల జోలికి పోతే అదే చివరి రోజు కావాలి.* దమ్ముంటే అలాoటి చట్టాలు తేవాలి.
----వడ్డేపల్లి మల్లేశం
సందర్భాను సారంగా నిర్వహించే వివిధ దినోత్సవాలకు సంబంధించి కార్యక్రమాలు అప్పటి వరకే పరిమితం కావడం వలన ఆ స్పృహ స్ఫూర్తి ఎల్లకాలం లేకపోవడం వలన ప్రతి వ్యక్తిలో సామాజిక చింతన నిబద్ధత కొరవడడం వలన అనేక రకాల అనర్థాలు జరిగిపోతూనే ఉన్నాయి .అందులో ఆడపిల్లల పైన జరుగుతున్న దుర్మార్గాలు అత్యాచారాలు హత్యలు అంతా అంతా కాదు. నెలల పాప నుండి పండు ముదుసలి వరకు సమాజంలోని ఏ మూలనో దాగివున్న దుర్మార్గ రాక్షసుల పాలిట బలి కాక తప్పడం లేదు. మరి వాళ్లకు కూడా తల్లి చెల్లి అమ్మ అందరూ ఉన్నారు కదా! వాళ్లకు కూడా ఇదే గతి పడితే ఎలా అనే సిగ్గు లేకపోవడం వల్లనే ఇతర ఆడపిల్లలు తల్లులు అక్కలను అవకాశం కోసం గుంట నక్కల్లా చూస్తూ కబలిస్తున్నారు. ఈ దుర్మార్గాన్ని అంతం చేయాలంటే అత్యాచారాలు, హత్యలను రూపుమాపాలంటే భారత ప్రభుత్వం ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్భయ దిశా చట్టాలను ఎన్ని చేసినా దేశవ్యాప్తంగా రోజురోజుకు నిరంతరం ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయిమరి. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు తెలిసిన కుటుంబాల వాళ్లే 30 శాతానికి పైగా పాల్పడడాన్ని కూడా సమాజం తల్లిదండ్రులు గమనించవలసిన అవసరం ఉంది. అంటే చనువు పెంచుకొని, పరిచయాన్ని పంచుకొని ,బలహీనతను సొమ్ము చేసుకుని ఆడపిల్లలను స్త్రీలను కర్కశంగా కాటు వేస్తున్న దుర్మార్గులకు ఉరి కంభం ఎక్కించనంతకాలం శిక్ష పేరుతో కాలయాపన చేస్తూ కనీసం యావజ్జీవ శిక్ష పదేళ్ల శిక్షకు పరిమితం చేస్తే అది సరిపోదు. ఇటీవల కలకత్తా ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి పైన జరిపిన హత్యాచారం పైన దోషికి కేవలం యావజ్జీవ శిక్షతో సరిపెట్టడం సమంజసం కాదు బహిరంగ ఉరిశిక్ష ద్వారా అలాంటి విద్రోహులకు గుణపాఠం రావాల్సిందే.
బాలిక దినోత్సవం నేపథ్యాన్ని పరిశీలిస్తే
ప్రతి సంవత్సరము జనవరి 24వ తేదీన నిర్వహించబడుతున్న జాతీయ బాలిక దినోత్సవం యొక్క ప్రాధాన్యత గమనిస్తే బాలికలను సంరక్షించుకోవడం, వారి హక్కులను కాపాడడంతోపాటు ఆరోగ్యాన్ని విద్యను వైద్యాన్ని ఎదుగుదలను ఉనికిని సమాజంలోని ఏ శక్తి కూడా ప్రశ్నించకుండా సమాజం భరోసా ఇవ్వవలసిన అవసరాన్ని గుర్తింప చేయడం కోసమే అని ప్రతి ఒక్కరు తెలుసుకోవలసి ఉంటుంది. అదే రకంగా అంశాల పైన ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి అంతేకాదు మహిళల పైన లైంగిక వేధింపులకు సంబంధించి ఇవాళ చట్టసభల్లో కూడా సభ్యులు నేరస్తులుగా ఉన్నారంటే భారత ప్రజాస్వామ్యం ఎంత అపహాస్యం పాలవుతున్నదో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ దినోత్సవం రోజున చట్టసభల్లో ఉన్నటువంటి నేరస్తులకు జైల్లో ఉన్నటువంటి మహిళల పైన అత్యాచారం చేసిన నిందితులు ఇతరులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను కూడా కొనసాగించి అదే సందర్భంలో భారీ శిక్షలు ఉంటాయని బహిరంగ ఉరిశిక్ష అనివార్యమని వారిపైన అకృత్యాలకు పాల్పడితే అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించడం కూడా అవసరం. అటు న్యాయ వ్యవస్థ ఇటు పాలకులు, కఠినంగా వ్యవహరించి ప్రకటన చేస్తే కానీ కొంతైనా మార్పు రాదు. ముఖ్యంగా పేద కుటుంబాలలోని బాలికలు పోషకాహారం లేక రక్షణ భరోసా కానరాక అవగాహన రాహిత్యముతో బాల్యవివాహాలతో అనారోగ్యం పాలవుతూ గౌరవానికి భంగం కలిగించే పద్ధతిలో జీవిస్తుంటే ఇదే అదనుగా భావించి పొంచి ఉన్న గుంట నక్కలు కబళించడాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా మన ఇంటి ఆడపిల్లల మాదిరిగానే ఇతరులు కూడా అనే సోయిని కల్పించడానికి ఈరోజు ఉపయోగపడాల్సిన అవసరం ఉంది . బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రజలలో అవగాహన పెంచడానికి రాజకీయ పార్టీలు ప్రజా ప్రతినిధులు అధికారులు ఆధ్వర్యంలోపల కార్యక్రమాలను కొనసాగించవలసిన అవసరం ఉంది. అదే సందర్భంలో బాల్యవివాహాలను కట్టడి చేయడంతో పాటు బాలికల యొక్క ఎదుగుదలకు సంబంధించి పోషకాహారాన్ని సరఫరా చేయడం బాధ్యతగా భావించడంతోపాటు చట్టపరమైన రక్షణ ఆరోగ్య విద్య పైన ప్రభుత్వాలు పునరంకి తం కావాల్సిన అవసరం కూడా ఉంది.
ముఖ్యంగా వివిధ రకాల దోపిడీని వివక్షతను ఎదుర్కొంటున్న స్త్రీలకు ప్రభుత్వము రాజకీయ పార్టీలు అధికారులు స్వచ్ఛంద సంస్థలు భరోసా ఇవ్వవలసిన అవసరం ఉంది అంతేకాదు పేదరికం ఆసరాగా తీసుకొని కొంతమంది దుర్మార్గులు మహిళలను చిన్నపిల్లలను ఇతర దేశాలకు అక్రమ రవాణా చేయడం లేదా కొన్ని వ్యభిచార కూ పాలకు అమ్మి వేయడంతో పాటు అక్కడ కూడా ఇంజక్షన్లను వేసి చిన్న పిల్లలని వ్యభిచారములోకి దించడాన్ని గమనించినప్పుడు మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ కల్లారా చూస్తూ కూడా ప్రభుత్వాలు మౌనంగా ఉంటున్నాయి అంటే పాలకవర్గాలకు సంబంధించిన వాళ్లకు కూడా ఇందులో హస్తం ఉన్నట్టుగా భావించవలసిన అవసరం ఉంటుంది.ఆ విషయాలను ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు ఖండించాలి. ఇప్పటికీ ఆడపిల్లలకు విద్య, పెంపకము, హక్కులు, స్వేచ్ఛ విషయంలో కుటుంబాలలో వివక్షత కొనసాగుతున్నది. ఆ విషయంలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం ద్వారా కుటుంబంలో పుట్టిన ఆడ మగ ఎవరైనా సమానమేనని ఆడపిల్లలు పుడితే అత్తమామల వేధింపులను మానుకునే విధంగా కఠిన చట్టాలు రావలసిన అవసరం ఉన్నదని గుర్తింప చేయడం కూడా ఈరోజు యొక్క ప్రాధాన్యతగా గమనించాలి ఆ వైపుగా ఆచరించాలి కూడ
ప్రభుత్వాల అలసత్వం మంచిది కాదు :-
ముఖ్యంగా ఆడపిల్లలు మహిళలు స్త్రీలు, వృద్ధ మహిళలు వేధింపులకు గురికావడానికి పనిచేసే పరిస్థితులు అత్యాచారానికి బలి కావడానికి ఇతరత్రా అనేక రకాల వివక్షతకు గురికావడానికి ప్రధానమైన కారణం ప్రభుత్వాలు మహిళలకు సంబంధించినటువంటి చట్టాలను ఏర్పరచకపోవడం ఉన్న వాటిని కట్టుదిట్టంగా అమలు పరచకపోవడమే. ప్రతిరోజు ఆడవాళ్ళ పైన అఘాయిత్యాలు నిరంతరం అత్యంత ఘోరంగా జరుగుతూనే ఉన్నాయి ఇటీవల హైదరాబాదులో ఒక ప్రబుద్ధుడు తన భార్యను ముక్కలు చేసి స్టవ్ పైన ఉడికించి తన అక్కస్సు తీర్చుకున్నాడు అంటే అక్రమ సంబంధం ముసుగులో అని తెలిసిపోతున్నది. మరికొందరు ఆడపిల్లలను యొక్క అవయవాలను దైవానికి ప్రసాదంగా పెట్టి తమ కోరికలు తీర్చుకోవడానికి అత్యాచారానికి పాల్పడి ఊపిరితిత్తులు గుండె లాంటి అవయవాలను దైవం ముందు పెట్టి వాళ్ల ముందు పెట్టి కోరిక తీ ర్చుకున్నారు. ముఖ్యంగా పేద మధ్యతరగతి ఆదివాసి వర్గాలకు చెందిన వాళ్లు ఎక్కువగా బలి కావడాన్ని గమనించినప్పుడు ఆర్థిక బలహీనత,అమాయకత్వం, నిరక్షరాస్యత, అందుబాటులో ఉండడము, ప్రతిఘటించే శక్తి లేకపోవడం వంటి అనేక కారణాల వలన ఈ వర్గాలు మాత్రమే బలవుతున్న విషయాన్ని సమాజం యావత్తు గమనించాలి. ఎక్కడికక్కడ సమాజంలోని భిన్న వర్గాలు ఖండించి నప్పుడు మాత్రమే భవిష్యత్తులో జరగకుండా ఉంటాయి అదే మాదిరిగా సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు కమిటీలు వేయడం నివేదికలు చెప్పించుకోవడం తప్ప ఆ తర్వాత వాటి జోలికి పోకుండా కాలం గడుస్తుంది క్లబ్బులు పబ్బులు ఈవెంట్లు సినిమాలు టీవీ ప్రసారాలతో పాటు సెల్ఫోన్ వ్యవస్థలోని అశ్లీల అర్థనగ్న దృశ్యాలు మాటలు చేష్టలు నటనలు అన్నీ కూడా మనసులో మృగత్వాన్ని పెంచి పోషించి తాత్కాలిక ఆవేశానికి గురి చేసి కోర్కెలను బలవంతంగా తీర్చుకోవడానికి అనివార్యమైన పరిస్థితుల్లోకి నెట్టి వేయబడడాన్ని మనం గమనించినప్పుడు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు సంస్థలు వేదికలను నిర్మూలిస్తే కానీ ఇలాంటి వేధింపులు అకృత్యాలు ఆగవు అని ప్రభుత్వం ముందుగా ఆలోచించాలి . మధ్యము మత్తు పదార్థాలు ధూమపానము ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించి పూర్తిగా నిషేధాన్ని విధించే విధంగా ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయాలి అప్పుడు మాత్రమే మహిళా గౌరవాన్ని హక్కులను కాపాడడానికి,ఆత్మగౌరవంతో పురుషులతో సమానంగా జీవించడానికి, తోటి వ్యక్తిని సాటి వ్యక్తిగా చూసే మానవతా కోణం రూపు దాల్చడానికి అవకాశం ఉంటుంది. స్త్రీ అబల అని సామూహిక అత్యాచారాలకు బలి చేయడానికి ముఠా ప్రబుద్ధులు దాడి చేయడం లాంటి విషయాల పైన ప్రభుత్వం కఠిన చట్టాలతోనే ఎక్కడికక్కడ అణచివేయాలి ఆ కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇవ్వాలి వారికి ఉరిశిక్ష సమంజసమని చాటి చెప్పాలి. బహిరంగంగా ప్రకటనలు కూడా చేయవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే మానవత్వం నశించి మనిషి క్రమంగా మాయమైపోతున్న ఈ రోజుల్లో కఠిన శిక్షలు వేయడం ద్వారా వాటికి సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా విద్యా వ్యవస్థ లోపల కూడా నైతిక విలువలను పునరుద్ధరించడం ద్వారా మాత్రమే బాలికలకు రక్షణా గౌరవము హక్కులను కాపాడి పురుషులతో సమానంగా జీవించే వ్యవస్థ ఏర్పడుతుంది. సమాజము ప్రభుత్వాలు ప్రజాసంఘాలు ఎంతో చేయవలసిన అవసరం ఉన్నది .
గర్భంలో ఉన్నప్పుడు ఆడపిల్లని తెలిసి భ్రూణ హత్యలకు పాల్పడడం అనేది ఆనవాయితీగా మారిపోయింది ఇటీవల వాటిపైన ఆంక్షలు విధించినప్పటికీ ఆడపిల్ల పుట్టిన తర్వాత కూడా అనాధగా ముళ్ళ పొదలకు పెంట కుప్పలకు బలి కావలసి వస్తున్నది. అలాంటి స్థితిని అరికట్టి ఆడపిల్లలపై ప్రత్యేక దృష్టి సారించడానికి భారత ప్రభుత్వం నేషనల్ గర్ల్స్ డెవలప్మెంట్ మిషన్ అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది 2008లో కేంద్ర ప్రభుత్వం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ బాలిక దినోత్సవం ప్రారంభించడం ద్వారా ఇది గత 17 సంవత్సరాలుగా భారత దేశంలో అమలవుతున్నది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )