మారోజు వీరన్న స్ఫూర్తితో బహుజన రాజ్యం రావాలి

మారోజు వీరన్న స్ఫూర్తితో బహుజన రాజ్యం రావాలి
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ
(రేవల్యూషన్ ఆఫ్ మా "రోజు" పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కామ్రేడ్ మారోజు వీరన్న 25వ వర్ధంతి సభ
సూర్యాపేట 31 మే 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- భారతదేశంలో విప్లవం విజయవంతం కావాలంటే వర్గ పోరాటంతో పాటుగా కుల నిర్మూలన పోరాటం చేయాలని " వర్గ- కుల నిర్మూలన జమిలి పోరాట సిద్ధాంతాన్ని రూపొందించిన సిద్ధాంతకర్త అమరుడు మారోజు వీరన్న 25వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో రెవల్యూషన్ ఆఫ్ మా రోజు పార్టీ ఆధ్వర్యంలో వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు.
ఈ సభకు సిపియుఎస్ఐ (ఆర్. యం ) పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చామకూరి నర్సయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1999 మే 16న అప్పటి సీమాంధ్ర పాలక ప్రభుత్వాల చేతిలో బూటకపు ఎన్కౌంటర్ గురైన కామ్రేడ్ మారోజు వీరన్న రూపొందించిన కులవర్గ పోరాట సిద్ధాంతం నేటికీ ప్రకంపనలు సృష్టిస్తుందన్నారు. ఆయన సిద్ధాంతాన్ని ఎత్తి పట్టుకొని, ముందుకు తీసుకు వెళ్లే క్రమంలోనే బహుజన శ్రామిక రాజ్య స్థాపన లక్ష్యంగా రెవల్యూషన్ ఆఫ్ మారోజు పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
"నూరు పువ్వులు వికసించనీ, వెయ్యి ఆలోచనలు సంఘర్షించనీ అని మావో చెప్పిన సూక్తి తమకు ఆదర్శం అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆరుట్ల జానకి రామ్ రెడ్డి మాట్లాడుతూ అణగారిన వర్గాల, కులాల గొంతుకగా నిలిచిన మారోజు వీరన్న 1997 లో తెలంగాణ మహాసభను స్థాపించి మలిదశ తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసినట్టుగా తెలిపారు. తన మాట, ఆట,పాటలతో తెలంగాణ పల్లెలను రగిలించిన మారోజు రూపొందించిన సిద్ధాంతమే అగ్రకుల పాలకవర్గాలకు కంటగింపుగా మారిన నేపథ్యంలోనే ఆయనను బూటకపు ఎన్కౌంటర్లో హతమార్చినట్లుగా ఆరోపించారు. మార్క్సిజం, అంబేద్కర్ ఇజం వెలుగులో నూతన సిద్ధాంతాన్ని రూపొందించి దళిత బహుజనుల చేతికి వజ్రాయుధాన్ని మారోజు వీరన్న ఇచ్చినట్లుగా తెలిపారు.
తెలంగాణ విద్యావంతులకు వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య మాట్లాడుతూ ఆధిపత్య కులాలు దళిత బహుజన కులాలను వేల సంవత్సరాలుగా భూములకు సంపదకు అధికారానికి దూరం చేస్తూ, మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తూ సంఘటితం కాకుండా చేస్తున్న కుట్ర ను ఛేదిస్తూ నూతన సిద్ధాంతాన్ని రూపొందించిన మారోజు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయినట్లు తెలిపారు.
25 ఏళ్ల క్రితం అగ్రకుల పాలకవర్గ ప్రభుత్వాల చేతిలో హత్యకు గురైన నేటికి తన సిద్ధాంతంతో మారోజు వీరన్న పాలకుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ రామచంద్రన్ రాష్ట్ర కార్యదర్శి ఎల్లుట్ల ఉపేందర్ జిల్లా కార్యదర్శి భాను ప్రసాద్ సి యు సి రాష్ట్ర నాయకులు అబ్దుల్ కరీం తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు నల్లడ మాధవరెడ్డి సామాజిక తెలంగాణ మహాసభ జిల్లా నాయకులు దడిపల్లి వెంకట్ సామాజిక ఉద్యమ నాయకులు చెరుకుపల్లి లక్ష్మణ్, నవిల ఉపేందర్, నాగరాజు విద్యార్థి నాయకులు గాలి వికాస్ పవన్ అలాగే సామాజిక ఉద్యమకారులు బహుజన నాయకులు, సామాజిక మహిళా సంఘం నాయకులు నాగమణి బేగం రజియా బేగం, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.