దేవరపోగ మధు కుటుంబానికి స్నేహితులు ఆర్థిక సాయం అందజేత

జోహార్ మిత్రమా..కన్నీటి వీడ్కోలు
బాల్య మిత్రుల ఆర్థిక అండతో మధు కుటుంబానికి ధైర్యం
చిన్నంబావి మండలం తెలంగాణ వార్త : చిన్నంబావి మండల పరిధిలోని పెద్ద మారూర్ గ్రామంలో “స్నేహం అనేది కేవలం చదువుకునే రోజుల జ్ఞాపకాలకే పరిమితం కాదు, మిత్రుడు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడటమే నిజమైన స్నేహం” అని మరోసారి నిరూపించారు. పెద్ద మారూర్ గ్రామ పూర్వ విద్యార్థులు పెద్ద మారూర్ గ్రామానికి చెందిన డి. మధు ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం చెందడం గ్రామంలోనే కాదు, అతని బాల్య మిత్రుల హృదయాల్లోనూ తీవ్ర శోకాన్ని నింపింది. టెన్త్ 2004 - 2005 బ్యాచ్ క్లాస్మేట్స్ మిత్రులు పెద్ద మారూర్ గ్రామ జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి వరకు చదివిన మధు స్నేహితులు ఈ విషాదకర వార్త విని ఒక్క క్షణం కూడా ఆగలేదు. వెంటనే వాట్సాప్ గ్రూప్లో చర్చించి, అకాల మరణం చెందిన మధు కుటుంబానికి కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులపై చలించి, స్పందించారు. అతి తక్కువ సమయంలోనే పూర్వపు విద్యార్థులు సహృదయంతో ముందుకు వచ్చి మొత్తం రూ. 32వేల ఐదు వందల రూపాయలు సేకరించి ఈ సహాయాన్ని శనివారం పెద్ద మారూర్ గ్రామంలో మధు భార్య సునీత కు అందజేశారు. మిత్రుల అండతో కన్నీటి పర్యంతమైపోయిన భార్య సునీత తల్లి నరసమ్మ , “నా కుమారుడు లేకపోయినా, మీరంతా మా బలంగా నిలుస్తున్నారు. మీ అందరికీ ఆశీర్వాదం” అంటూ హృదయాన్ని ముద్దొలిపేలా మాట్లాడారు. ఆ సందర్భంగా మిత్రులు మధు చిత్రపటానికి పూలమాల వేసి, కన్నీటి కళ్ళతో నివాళులర్పించారు. ఒకే పాఠశాలలో చదివిన మిత్రుడు ఇక లేడన్న నిజాన్ని ఒప్పుకోలేకపోయిన వారు, “మధు లేని లోటు ఎప్పటికీ తీర్చలేం, కానీ అతని కుటుంబానికి అండగా నిలిచి మధు స్నేహాన్ని సజీవంగా ఉంచుతాం” అన్నారు. ఈ కార్యక్రమంలో స్నేహ బృందం బొల్లెద్దుల సురేష్, శరత్ కుమార్, లోకేష్ యాదవ్, ఎండి షాలు, కల్వకోలు రాఘవేంద్ర, కేతాఫగ శివ, పెద్ద దగడ చెన్నకేశవులు, కెవికె ప్రాజెక్ట్ డైరెక్టర్ కె విజయ్ కుమార్, తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.