ఘనంగా శ్రీ గోపాల దాసుల రథోత్సవం
జోగులాంబ గద్వాల 22 జనవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: ప్రముఖ కర్ణాటక వాగ్గేయకారుడు, గణేశ అంశ్యులైన ఉత్తనూరు శ్రీ గోపాల దాసుల ఆరాధన ఉత్సవాలలో భాగంగా బుధవారం మధ్యారాధన సందర్భంగా స్వామివారి ఉత్సవ విగ్రహంతో రథోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఐజ మండలం ఉత్తనూర్ గ్రామంలో వెలిసిన శ్రీ గోపాల దాసులవారి గృహము నుండి శ్రీ ధన్వంతరి వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు భక్తులు హరినామ సంకీర్తనలు ఆలపిస్తూ రథోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామికి మొక్కులు సమర్పించుకున్నారు. శ్రీ గోపాల దాసుల మూల సంస్థాన ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ గోపాల దాసుల వంశస్థులు, భక్తులు పాల్గొన్నారు.