గురుకులాల సంక్షేమ శాఖ వసతిగృహాల విద్యార్థుల పట్ల నిర్లక్ష్యానికి దావులేదని ఉండవెల్లి జ్యోతి బాబు పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో సంఘటన పునరావృతం కాకూడదు కలెక్టర్
జోగులాంబ గద్వాల 1ఆగస్టు 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల. గురుకులాలు, సంక్షేమ శాఖల వసతి గృహాల విద్యార్థుల పట్ల నిర్లక్ష్యానికీ తావులేదని, ఉండవల్లి జ్యోతిబాపూలే బిసి బాలుర గురుకుల పాఠశాలలో జరిగిన సంఘటన పునరావృతం కాకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఐడీఓసీ సమావేశం హాల్లో రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టల్స్ నిర్వహణపై జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. పాఠశాలలు, హాస్టల్స్ నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం చేసిన తగిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇటీవల ఒక పాఠశాలలో జరిగిన ఘటనపై డిప్యూటీ వార్డెన్, సూపర్వైజర్లను సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. నిర్లక్ష్యం వహించిన ఇతర సంబంధిత అధికారులకు కూడా మెమోలు జారీ చేశామని తెలిపారు. పాఠశాలలో విద్యార్థుల సంక్షేమం కోసం మండల స్థాయి అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని అన్నారు. అన్ని మండలాలకు జిల్లా స్థాయి స్పెషల్ అధికారులను నియమించడం జరిగిందని, ప్రతి నెలా కనీసం రెండు సార్లు పాఠశాలలు సందర్శించి అక్కడి విద్యా భద్రతా,మౌలిక వసతులైన త్రాగునీరు, మరుగుదొడ్లు, ఇతర అవసరాలను సమీక్షించాలని సూచించారు. తహసీల్దారులు, ఎంపీడీవోలు తమ పరిధిలోని వసతి గృహాలలో తనిఖీలు నిర్వహిస్తూ అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు వెంటనే స్పందించాలన్నారు. విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం నాణ్యమైన పోషకాహారంతో కూడిన భోజనం తప్పనిసరిగా అందించాలని, ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆహార కమిటీ పర్యవేక్షణలో,ప్రతి రోజు భోజన నాణ్యతను పరిశీలించి, ఇద్దరు విద్యార్థుల సంతకాలతో రికార్డులు నిర్వహించాల్సిందిగా ఆదేశించారు. మెనూలో పేర్కొన్న ఆహార పదార్థాలలో ఏదైనా లోపం ఉంటే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. స్కూళ్లను లేదా హాస్టల్స్ను సందర్శించే సమయంలో తాగునీరు, మరుగుదొడ్లు, పరిసరాల పరిశుభ్రత, స్టార్ రూమ్, కిచెన్ వంటి కీలక మౌలిక వసతుల పరిస్థితిని తప్పనిసరిగా పరిశీలించాలని, నాణ్యతలేని పురుగుల బియ్యం ఉంటే వెంటనే మార్చుకోవాలని సూచించారు. వసతి గృహాలలో ఏదైనా సమస్యలు తలెత్తితే వెంటనే తహసిల్దార్, ఎంపీడీఓ, పోలీస్ అధికారులకు తెలియపరచాలని, తహసిల్దార్ మండల స్థాయి మెజిస్ట్రేట్ కాబట్టి వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఏమైనా తీవ్ర సమస్యలు తలెత్తితే ఇట్టి విషయాన్ని వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలు, హాస్టల్స్ ప్రాంగణాలలో అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించాలని, ముఖ్యంగా బాలికల హాస్టల్స్ విషయంలో మరింత నిఘా పెట్టాలన్నారు.
జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు మాట్లాడుతూ, జిల్లాలో ఎలాంటి సంఘటన జరిగినా పోలీసు శాఖ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని, వసతి గృహాల ప్రతి విషయం పట్ల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అధికారుల నిర్లక్ష్యం, ఇతర వ్యక్తుల ప్రమేయం వల్ల విద్యార్థులు రోడ్లపైకి రావడం జరిగింది అన్నారు. పాఠశాలలు, వసతి గృహాలలో అనధికార వ్యక్తులు, ముఖ్యంగా మహిళల హాస్టలో ప్రవేశించకుండా కఠిన నిబంధనలు పాటించాలన్నారు. విద్యా వ్యవస్థలో బయటి వారికి అనుమతించకూడదని, వసతి గృహాల విద్యార్థుల హక్కులకు భంగం కలిగించే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. అలాగే పాఠశాలల ఆవరణలో స్థానికులు రాత్రిపూట మద్యం త్రాగడం వంటి చర్యలు పాల్పడే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల స్థాయిలో అధికారులు, పోలీసు విభాగం పరస్పరం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పోలీసు శాఖ జిల్లా యంత్రాంగానికి పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ, నర్సింగ రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు,ఆర్డీఓ అలివేలు, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపిడిఓలు, స్పెషల్ ఆఫీసర్స్, విద్యా శాఖ అధికారులు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల ప్రిన్సిపాళ్లు మరియు ఇతర ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.