బ్రైట్ పాత్ లెర్నింగ్ సొల్యూషన్ పుస్తకాల విక్రయ శాల పై విచారణ జరపాలి: పీడీఎస్యూ
అధిక ధరలకు పుస్తకాలు విక్రయిస్తే మూసివేయాలి: సంఘం జిల్లా అధ్యక్షుడు హరీష్ డిమాండ్.
జోగులాంబ గద్వాల 31 జులై 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :- అయిజ. మండల కేంద్రంలో బ్రైట్ పాత్ లెర్నింగ్ సొల్యూషన్ పేరుతో నిర్వహిస్తున్న బుక్ స్టాల్ పై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) జిల్లా అధ్యక్షుడు హరీష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విక్రయ శాల నిర్వహణలో నివేదిత పాఠశాలల యాజమాన్యాలు భాగస్వాములై ఉంటూ పుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. పాఠశాల యాజమాన్యాలు తమ ఇష్టానుసారంగా ధరలను నిర్ణయించి విద్యార్థుల తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తరగతుల వారీగా పుస్తకాల ధరల దోపిడీ ఇలా ఉన్నాయి ఈ విక్రయ శాలలో ఎల్కేజీ పుస్తకాల ధర ₹2,650, యూకేజీ ₹2,900, 1వ తరగతి ₹3,251, 2వ తరగతి ₹3,450, 3వ తరగతి ₹3,570, అలాగే 4వ తరగతి పుస్తకాల ధరను ఏకంగా ₹4,120గా నిర్ణయించి విక్రయిస్తున్నారని వివరించారు. ఇంత భారీగా దోపిడీ జరుగుతున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న విక్రయ శాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే దానిని సీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.