కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం – ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
మత్స్యశాఖను మరింత అభివృద్ధి చేస్తాం – మంత్రి డా. వాకిటి శ్రీహరి తెలంగాణ ఇందిరా మహిళా శక్తి, మత్స్యశాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నీలి విప్లవ పథకం కింద సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీ కార్యక్రమం నేడు ప్రజాభవన్లో ఘనంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా లబ్ధిదారులైన మహిళలకు చేపల విక్రయ వాహనాలను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌ. శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి గౌ. డా. వాకిటి శ్రీహరి గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు అందజేశారు. ఉప ముఖ్యమంత్రి విక్రమార్క గారు మాట్లాడుతూ –
“కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. ప్రజల మధ్యే ఉండి వారి అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తున్న మంత్రి వాకిటి శ్రీహరి గారి సేవలు అభినందనీయమైనవి” అని పేర్కొన్నారు.
రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డా. వాకిటి శ్రీహరి గారు మాట్లాడుతూ –
“తెలంగాణలో చేపల ఉత్పత్తిని విస్తృతంగా పెంచి, ఇతర రాష్ట్రాలకు మాత్రమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి మత్స్యశాఖను తీసుకువెళ్లడం మా లక్ష్యం. ఈ దిశగా మహిళల సాధికారతకు, మత్స్యకారుల అభివృద్ధికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుంది” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి గారు, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు, మత్స్యశాఖ ఉన్నతాధికారులు, లబ్ధిదారులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.