ఉచితంగా యాంటీ రేబిస్ టీకాలు
ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా పశువైద్యుల చొరవ.
పెంపుడు జంతువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలన్న అధికారులు.
జోగులాంబ గద్వాల 6 జూలై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం అయిజ పట్టణ కేంద్రంలోని పశువైద్యశాల ఆవరణలో పశుసంవర్ధక శాఖ మరియు పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కుక్కలకు ఉచిత యాంటీ రేబిస్ టీకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పశువైద్య బృందం స్థానిక కుక్కలకు ఉచితంగా రేబిస్ నివారణ టీకాలు వేయడంతో పాటు, జంతువుల ద్వారా మనుషులకు సంక్రమించే ప్రమాదకరమైన జూనోటిక్ వ్యాధుల పట్ల ప్రజలకు మరియు పెంపుడు జంతువుల యజమానులకు విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పశువైద్యాధికారులు మాట్లాడుతూ పెంపుడు కుక్కలకు ప్రతి సంవత్సరం తప్పనిసరిగా యాంటీ రేబిస్ టీకా వేయించడం ద్వారా రేబిస్ వ్యాధిని సమర్థవంతంగా నివారించవచ్చని తెలిపారు. ప్రజలు తమ పెంపుడు జంతువుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, క్రమం తప్పకుండా టీకాలు వేయించి జూనోటిక్ వ్యాధుల నివారణలో భాగస్వాములు కావాలని సూచించారు. వ్యాధుల పట్ల అప్రమత్తతతోనే ప్రజారోగ్యాన్ని కాపాడుకోగలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అయిజ మండల పశువైద్యాధికారిణి ప్రియాంక, వైద్యాధికారిణి హరిప్రియ, సహాయకుడు పి. సుధాకర్, పశుగణాభివృద్ధి పర్యవేక్షకుడు సూర్యారెడ్డి, క్షేత్రస్థాయి ప్రతినిధులు శ్రీకాంత్ రెడ్డి, తిరుమలేష్ నాయుడు, భాస్కర్, ఆంజనేయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.