ఫీజు రియంబర్స్మెంట్ విడుదలకై చలో ఉస్మానియా యూనివర్సిటీ పోస్టర్ ను
ఉస్మానియా యూనివర్సిటీ రాష్ట్ర నాయకులు కొంపెల్లి నరేష్ తో కలిసి ఆవిష్కరించిన
బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య.
జోగులాంబ గద్వాల 28 జూన్2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- బలహీన వర్గాల బిడ్డలను చదువు కు దూరం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్. * ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌక్ లో ఉస్మానియా యూనివర్సిటీలో జూలై 22న జరగబోయే ఫీజు రీయంబర్స్మెంట్ విడుదలకై జరిగే విద్యార్థి సదస్సు పోస్టర్ ను ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు కొంపెల్లి నరేష్ తో కలిసి రిలీజ్ చేసిన బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకుడు కురువ పల్లయ్య ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య, కొంపెల్లి నరేష్ మాట్లాడుతూ...ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
గత 30 నెలలుగా తెలంగాణలో విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. ఒకప్పుడు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ విద్యావ్యవస్థ నేడు దిగజారిపోయిన స్థితికి చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగాల్లో "భవిష్యత్ తెలంగాణ అంటే విద్యార్థులు, విద్యావ్యవస్థ" అని చెబుతున్నప్పటికీ, ఆచరణలో మాత్రం విద్యారంగాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. భవిష్యత్ తరాలను నిర్లక్ష్యం చేయడం అంటే తెలంగాణ భవిష్యత్తునే నిర్లక్ష్యం చేయడమేనని అన్నారు. విద్యా వ్యవస్థలో పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రత, ప్రణాళిక లోపించాయని, విద్యాసంస్థలకు అవసరమైన నిధులు విడుదల చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, విద్యావ్యవస్థను గాలికి వదిలేసిందని విమర్శించారు. ఈ సందర్భంగా కొంపల్లి నరేష్ నిర్వహణలో వచ్చే నెల జులై 22 వ తేదీన హైదరాబాద్లోని ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థుల సమస్యలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, విద్యారంగ పరిరక్షణ అంశాలపై జరిగే రాష్ట్ర స్థాయి విద్యార్థి సదస్సు సదస్సుకు భారీ ఎత్తున తరలి విజయవంతం చేయాలని అన్నారు.
ఈ సదస్సుకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, విద్యార్థి నాయకులు, మేధావులు, విద్యావేత్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులతో కలిసి బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బిఆర్ఎస్వి నాయకులు వెంకట్, బాలరాజ్, మాధవ్ మహేష్ ఇమ్రాన్ యువరాజ్ కిరణ్ రమేష్ నరసింహ సాయన్న తదితరులు పాల్గొన్నారు.