ఆకలి కేకలు ఒకవైపు అన్నపురాసులు మరొకవో ట

Aug 23, 2025 - 12:25
 0  5

 అంతేకాదు  ఆహార వృధా  ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్య.*  సమయస్ఫూర్తి, సామాజిక చింతన లేని  దుర్మార్గుల కారణంగా ఈ వ్యవస్థ దాపురిస్తున్నది.* అది ఇంటా, బయట, హోటల్లు, ఎక్కడైనా అంతే.*
***********
---వడ్డేపల్లి మల్లేశం 9014206412 
---28....03....2025*****
మానవ మనుగడకు  ఆహారం  ఆకలి ప్రధానమైనటువంటి  అంశాలు కాగా  వీటి అసమతుల్యత,  దూర్వినియోగం ,సమయస్ఫూర్తి లేకపోవడం,  ఆహారం పట్ల నిర్లక్ష్యం, పండించిన రైతుల పట్ల   చులకన భావం,  నాగరికత ముసుగులో కొనసాగుతున్నటువంటి ఆదిపత్య ధోరణి, అహంభావం వల్ల జరుగుతున్న   ఆహార వృధాను   గండి కొట్టాల్సిన అవసరం చాలా ఉన్నది. ఇది కేవలం ఒక దేశానికి సంబంధించిన విషయం కాదు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి  త ప్పుడు ఆలోచన ఆచరణ దాని పర్యవసానం అనేక పరిణామాలు.ఆకలి కేకలతో అల్లాడుతున్నటువంటి కోట్లాదిమంది ప్రపంచంలో ఈనాటికీ మనకు తారసపడుతున్నారు  అయినా వృధా చేసే దగ్గర  అంతులేని వృధా అవుతూ ఉంటే  ఆలోచించే కొద్ది మందికి మాత్రమే బాధ అనిపించడం  మొత్తం మీద  ఆహార సరఫరా లో అసమతుల్యత  ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్యగా భావిస్తే కానీ దానికి పరిష్కారం దొరకదు.  ప్రముఖ విప్లవకవి కాలోజీ అన్నట్లుగా అన్నపురాశులు ఒకచోట ఆకలి మంటలు మరకచోట  అనేది నిత్యకృతం. సర్వత్రా కనిపిస్తున్నటువంటి   సజీవ సాక్ష్యం.  అయితే ఆహార ఉత్పత్తిలో భాగస్వాములు అవుతున్నటువంటి శ్రమజీవులు కార్మికులు, రైతులు కూలీలను   ఎవరూ కూడా గౌరవించకపోవడం చూడకపోవడం గుర్తించబడకపోవడం  వారి శ్రమను దోపిడీ చేయడమే అవుతుంది.  ఆహార వృధా అనేది నిజంగా  రైతు లోకాన్ని వ్యవసాయ రంగాన్ని  అవమానించడం తప్ప మరొకటి కాదు అని ప్రతి మనిషి గుర్తించాలి .ప్రతి రంగానికి సంబంధించి జాతీయస్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ  సూచికలు ఉన్నట్లుగా  ఆహార వృధాకు సంబంధించి కూడా  ప్రపంచ స్థాయిలో ఫుడ్ వేస్ట్ ఇండెక్స్  రిపోర్టు 2024 వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు  తెలుసుకుంటే  మనం వేస్తున్న తప్పటడుగులు,  చేస్తున్న దురాలోచన, వృధా అంతా ఇంతా కాదు.  అందుకే ఒకవైపు పస్తులు మరొకవైపు వృధా  అనే  నినాదం కూడా బలీ యమైనది దానిని లోతుగా ఆలోచించవలసిన అవసరం కూడా ఉన్నది.  ఇప్పటికీ ప్రపంచంలోని అనేక దేశాలలో ఒకవైపు అనారోగ్యం కారణంగా  వాయు ఇతర కాలుష్యాలతో పాటు ఓజోన్ పొర రంద్రం పడి అతినీలలోహిత కిరణాల కారణంగా చావు బతుకుల్లో పిల్లలు పెద్దలు కొట్టుమిట్టాడుతూ ఉంటే మరికొన్ని దేశాలలో కనీసమైన ఆహారమే కరువై  బక్క చిక్కిన బాలలు  భవిష్యత్తుకు వారసులు ఎలా అవుతారు అర్థం చేసుకోవచ్చు.  దేశాలకు ప్రాంతాలకు అతీతంగా చూడవలసినటువంటి ఈ సమస్యను  ఎక్కడికక్కడ పరిష్కరించుకోవడం మొత్తం మీద  వృధా ను తగ్గించుకోవడం  మిగులు దేశాల నుండి  లోటు  దేశాలకు సరఫరా చేయడం వల్ల  ఆ బాధ్యతను అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్యసమితి  మానవ హక్కులను పరిరక్షించే క్రమంలో బాధ్యతగా చేపట్టడం వలన  ఆహార పంపిణీ సాధ్యమవుతుంది. ఒకచోట పస్తులు మరొకచోట వృధా అనేదానికి అడ్డుకట్ట వేయడానికి ఆస్కారం ఉంటుంది  దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రిపోర్ట్ ఆధారంగా అన్ని దేశాలతో సమావేశం ఏర్పాటు చేసి  ప్రపంచమంతా కుటుంబం లాగా భావించినప్పుడు మాత్రమే  ఈ ఆహార వృధాను అరికట్టడానికి అవకాశం ఉంటుంది.  ఇప్పటికీ వివాహాలు  ఇతర శుభ కార్యక్రమాలు ఫంక్షన్లు  సభలు సమావేశాల సందర్భంగా భోజన సౌకర్యం ఏర్పాటు చేసిన ప్రతిచోట అంతేకాదు హోటల్లు రెస్టారెంట్లు బార్లతో పాటు కుటుంబంలో ప్రతి నిత్యం కూడా  కోట్ల టన్నుల ఆహారం వృధా అవుతున్నట్లుగా మనం గమనించవచ్చు. ఒక్కసారి మన కుటుంబాలను మనం పరిశీలిస్తే ఎంత వృధా చేస్తున్నామో అర్థం చేసుకోవచ్చు కదా! ఇదంతా జాతి సంపదను కొల్లగొట్టడమే అవుతుంది  రైతులను అవమానించడమే అవుతుంది ఆ హక్కు మనకు లేదు అని తెలుసుకోవడం చాలా అవసరం.
      2024 ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారంగా :-
**---*********-**-
ఒకరికి తినడానికి దొరకదు మరొకరికి తింటే అరగదు  ఇష్టం లేక కొందరు,నాగరికత పేరుతో మరికొందరు,  అహంభావంతోనే కొందరు, అంచనా సరిగా లేక మరికొన్నిచోట్ల  కారణం ఏదైతేనేమి ఆహారం వృధా కావడం అనేది  ప్రవహిస్తున్న నీళ్లలా   సర్వత్రా వ్యాపించి  మానవ నాగరికతను ప్రశ్నిస్తున్నది దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రపంచ మానవులందరి మీద ఉన్నది. ఒక్కసారి నివేదిక అంశాలను పరిశీలిద్దాం .2023లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 73 కోట్ల మంది ఆకలి బాధను  అనుభవించినట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది అంటే  ఆకలి తీవ్రత  ప్రపంచవ్యాప్తంగా ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.  ఒకవైపు ఈ రకంగా ఎంతోమంది తిండిలేక అలమటిస్తుంటే  మరొకవైపు పెద్ద మొత్తంలో ఆహారం చెత్తకుప్ప  ల్లోకి చేరడం,  దుబారా కావడం,  డ్రైనేజీల పాలు కావడాన్ని  మనం గమనించవచ్చు.  ఈ దుబారా అనేది కేవలం   వినోదాల వంటి పెద్ద కార్యక్రమాల్లోనే కాకుండా ఇండ్లు హోటల్లు చిల్లర దుకాణాలు  వంటి చోట్ల కూడా  ఆహారం మట్టి పాలు కావడం,  ఆకలైన వానికి దొరకకపోవడం,  ఉన్న దగ్గర తినకపోవడం  ఈ అసమతుల్యతను ఎట్లా అర్థం చేసుకుందాం?  సాధారణంగా వినియోగదారులు  ఆహారాన్ని తీసుకునే క్రమంలో కూడా అందుబాటులోకి వచ్చినటువంటి ఆహారంలో సుమారు  19 శాతం నిరుపయోగం అవుతున్నట్లు  గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2022లో  ప్రపంచవ్యాప్తంగా చేసిన గణన  ఆధారంగా  కుటుంబాల్లో ఇండ్లలో 63 కోట్ల టన్నుల ఆహార పదార్థాలు  చెత్తలో కలిసిపోయినట్లు  దుబారా అయినట్లు  గణాంకాలు వెల్లడిస్తుంటే  ఈ రకంగా దుబారా అయ్యేటటువంటి ఆహార పదార్థాలను  ఇష్టం ఉన్నట్లుగా అంచనా వేసి మట్టిలో  కలుప కుండా ఉండి ఉంటే  ఆకలితో అలమటించే  అన్నార్తుల ఆకలి బాధలు తీ ర్చడానికి  రోజుకు ఒక పూట అయినా   అందించే అవకాశం ఉండేది కదా?  ఈ దుబారాను అరికట్టడానికి ఏ స్థాయిలో నిర్ణయం తీసుకోవాలి?  ఎవరు ఆలోచించాలి? దీనికి న్యాయ నిర్ణీత ఎవరు?  అని ఆలోచిస్తే ఇది  ఎక్కడికక్కడ జరగాల్సినటువంటి ప్రక్రియ.  మొత్తం మీద ఆహారం మీద,  పండించిన ఆహార పదార్థాల మీద,  దానికి మూలకారకులైనటువంటి రైతుల మీద గౌరవభావం ఉన్నప్పుడు మాత్రమే ఈ రకంగా వృధా చేయకుండా చాలా జాగ్రత్తగా వుండే  అవకాశం ఉంటుంది.  ఒక కుటుంబాన్ని తీసుకున్నప్పుడు  కుటుంబ సభ్యులు ఎందరు? రోజుకు అవసరమెంత? అనే ఇంగిత జ్ఞానం లేకుండా  అంచనా ఎక్కువగా వేసి వినియోగించకుండా వివిధ రకాల సాకులతో పక్కనపెట్టి  చెడిపోయిన తర్వాత  మట్టి పాలు చేసే దుష్ట సంస్కృతి ప్రతి కుటుంబంలో ఉన్నది అంటే  అతిశయోక్తి కాదు.  ఇక హోటల్లు బార్లు రెస్టారెంట్లలో  జరుగుతున్నటువంటి  వృధాకు అంతే లేదు. ఇది సామూహికంగానూ వ్యక్తిగతంగానూ ఎవరికి వారికి  ఉండాల్సినటువంటి ఒక ఆలోచన, సామాజిక చింతన, ప్రాపంచిక దృక్పథం పైన ఆధారపడి ఉంటుంది. అదే స్థాయిలో  ప్రతి దేశం కూడా అక్కడి పాలకులు   ఆహార నియంత్రణకు సంబంధించి  కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా మార్గ నిర్దేశాలు చేయడం ద్వారా  కొంతవరకైనా అరికట్టడానికి అవకాశం ఉంటుందేమో!
  2022 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా  1)ఇండ్లలో జరిగిన ప్రపంచ స్థాయి వార్షిక సగటు  తలసరి వృధా 79 కిలోలు కాగా   ఆ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా జరిగిన మొత్తం వృధా 63 కోట్ల టన్నులు .
2)హోటల్లు రెస్టారెంట్లు  ఇతర సభలు సమావేశాల వంటి చోట్ల  ప్రపంచ వార్షిక సగటు తలసరి వృధా  36 కిలోలు కాగా  ప్రపంచవ్యాప్తంగా మొత్తం వృధా 29 కోట్ల టన్నులు.
3)  చిల్లర వర్తకాలు  ఇతరత్రా  ఆరు బయట కార్యక్రమాలు భోజనాల వద్ద  ప్రపంచ వార్షిక సగటు తలసరి వృధా 17 కిలోలు కాగా  ప్రపంచవ్యాప్తంగా మొత్తం వృధా 13 కోట్ల టన్నులని  గణాంకాలు తెలియచేస్తున్నాయి . పై గణాంకాలను నిశితంగా  పరిశీలిస్తే వ్యక్తిగతంగా   ఏడాదిలో తలసరిగా వృధా అయినటువంటి ఆహారం 132 కిలోలు కాగా  అన్ని రకాలుగా మొత్తం వృధా అయినటువంటి ఆహార పదార్థం 105 కోట్ల టన్నులు అని  నిర్ధారించడం జరిగింది. ఈ వృధా అయినటువంటి  కోట్ల టన్నుల ఆహార పదార్థాలు ఎన్ని కోట్ల జనానికి  ఆకలి తీర్చగలుగునో  ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే అంచనా వేస్తే ఆ వైపుగా ఆలోచిస్తే  మనం  చేస్తున్న దుబారాను  నిర్లక్ష్యంను  సవరించుకోవలసినటువంటి అవసరాన్ని తెలియజేస్తున్నది. ఆ వైపుగా  వృధాను అరికట్టే ప్రక్రియను మనతోనే మన ఇళ్లలో నుండీ  ప్రారంభిద్దాం. పండించిన రైతులను గౌరవిద్దాం! వృధా చేసే వాళ్లకు గుణపాఠం కలిగిద్దాం.!
(   ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు అరసం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333