సీతా రామ కళ్యాణం కాంచిన వైభోగమే...

శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం సీతాపతిం రఘు కులాన్వయ రత్న, దీపమ్ ఆజాను బాహం -అరవింద దళాయతాక్షం "రామం నిశాచర వినాశకరం నమామి :
పరమాత్మ అనేకమైనటు వంటి అవతారాలు చేసాడు.
ఆయన ఏ అతారాన్ని స్వీకరించినా దాని ప్రయోజనం, పరమార్థం ఒక్కటే ధర్మాన్ని నిలబెట్టడం,లోక కళ్యాణం చేయడం. అధర్మాన్ని అణచడం...
యదోద్దారణ మందరాభరణ పృథ్వీ ధర్మ నిర్మాణ ఫ్రహ్లాద ప్రాణ బలీ ప్రధాన నృపాహంకార వీర్వాపన వైదేహి రమణ దనంజయ జయ వ్యాపార పారీనా క్షోమీ దివ్యత్ కరుణ తమో హరణా తండ్రీ వెంకటేశ ప్రభో" అంటారు.
పరమాత్మ అన్ని అవతారాలలో రామ చంద్ర మూర్తి అవతారం అత్యంత ఉత్కృష్టమైనది.
నరునికి సంబంధించినంత
వరకు ప్రవర్తన, ధర్మ మార్గం, నిజాయితీ లకు నిలువెత్తు సాక్ష్యం లా అవతరించాడు రాముడు.
వాల్మీకి మహర్షి నారదున్ని అడిగాడట 16 సకల సుగుణాలు గల పరిపూర్ణ నరుడు ఎవడు అని. అప్పుడు నారదుల వారు రాముడిని చూపించాడట. అటువంటి భగవంతుని పక్కన శక్తి లేకుండా పూర్ణత్వాన్ని పొందలేడు. అందుకే సీతాదేవి ని పెళ్లాడి రామచంద్రమూర్తి శ్రీరామచంద్రమూర్తి అయ్యాడు.
లోకంలో సీతా కళ్యాణ ఘట్టం అత్యంత
ఉత్కృష్టమైనది.నరుడిగా పుట్టి, నరుడిగా పెరిగి, కష్టాలు పడి, చివరికి నరుడిగానే అవతారం చాలించాడు.
ఆయన సత్యం చేత లోకాలను గెలిచాడు
ధర్మం చేత సమస్తాన్ని గెలిచాడు
సుశ్రూత చేత గురువులను గెలిచాడు దీనులను దాన గుణాలతో గెలిచాడు
అలాగే శత్రువులను తన పౌరుష పరాక్రమాలతో గెలిచాడు.
నరుడిగా వచ్చి మానవులకు విలువలు నేర్పాడు. అటువంటి శ్రీరామ నవమి నాడు ఉపవాసం ఉండి రాముడి పట్టాభిషేక సర్గ చదివితే సర్వ పాపాలు హరిస్తాయి. అలాగే ఈరోజు జరిగే సీతా రాముల కళ్యాణమ్ ఎంతో విశిష్టమైనది.
అస్టాక్షరీ మహా మంత్యంలోని 'రా' ను
పంచాక్షరి మహా మంత్రం లోని "మ'ను తీసుకుని 'రామ' నామంగా మనందరికీ వశిష్ట మహార్షి అందించారు..
అసలు రామ స్పర్శ లేని విషయం లేదు. ఏదైనా రాయడం మొదలు పెడితే శ్రీరామ అని మొదలు పెడతాం.రామ రక్ష అని దీవిస్తాం
పిల్లవాడికి చిన్నతనంలో రాముని కథ చెబుతాం
రాముడంతటోడివి కావాలి అని దివిస్తాం
ఒకడు అహంకారి అయితే రావణుడు అంటాం.
అసూయతో ప్రవర్తిస్తే సుర్పణక్క అంటారు
అతిగా నిద్రిస్తే కుంభకర్ణుడు అంటారు.
ఇలా రామాయణం అనేది మానవ సమాజం నుండి విడదియటానికి వీలు లేకుండా మమేకమైంది.
రామాయణం చదివినంత మాత్రాన ఒక మనిషి ఉత్తాన పతన స్థితిలో ఎలా ఉండాలో చెబుతుంది. ఒక కష్టం వచ్చినప్పుడు రాముడు ఎలా నిలబడ్డాడు. సీతమ్మ ఎలా ఎదుర్కొంది అనేది తెలుసుకుంటే మనం పొందుతున్న కష్టం కష్టమా అన్పిస్తుంది. మనుష్యులు పొందిన కష్టాలలో కెల్లా పెద్ద కష్టం ఏంటంటే తన కష్టం చెప్పుకోవడానికి పక్కన ఎవరు లేకపోవడమే. సీతమ్మ తాను అంత కష్టం లో ఉండి, తన కష్టం చెప్పుకోడానికి పక్కన ఎవరు లేకుండా అన్ని రోజులు రావణ లంక లో బాధ పడింది. ఆ తల్లి బాధ కన్నా మన బాధ ఏపాటిది అని అనుకున్న నాడు మనిషి తన ధర్మాన్ని విడిచి పెట్టకుండా ఉంటాడు.
అంత గొప్ప ప్రాశస్థ్యం గల సీతా రాముల
కళ్యాణాన్నీ కన్నులారా కాంక్షిద్దాం.
ఈ కళ్యాణం చూసినంత మాత్రం చేత,
తలంబ్రాలు తలమీద వేసుకున్న కారణం చేత,తానే కాక తన చుట్టుపక్కల వారే కాకుండా సమాజం అంత కూడా వర్ధిల్లుతుంది. లోక కళ్యాణం జరుగుతుంది
ఈ శ్రీరామ నవమి నాడు రామ నామం సంకీర్తన చేసి, అయన కల్యాణాన్ని లోక కళ్యాణంగా భావించి కన్నులారా వీక్షించి తరించుదాం. ఆ సీతారాముల కృపకు పాత్రులమవుదాం.