వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం
ముఖ్యఅతిథి ఖమ్మం నగర మాజీ మేయర్ పూనుకొల్లు నీరజ
ఖమ్మం : వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం నగర మాజీ మేయర్ పూనుకొల్లు నీరజ పాల్గొని మాట్లాడారు. ప్రజలలో చాలామందికి నేత్రదానంపై అపోహాలు ఉన్నాయని దీనిపై అవగాహన లేదని సోషల్ మీడియాలో మరియు మీడియా ద్వారా ప్రచారింపజేసి అవగాహన తీసుకురావాలని కోరారు. ఒక దాత ఇద్దరుకు దృష్టిని దానం చేయవచ్చు అని అన్నారు. కళ్ళు మన శరీరంలో అత్యంత విలువైన భాగం కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని తదనంతరం నేత్రదానం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా వాసన్ ఐ కేర్ హాస్పిటల్ డాక్టర్ కిషన్, డాక్టర్ శివరాం, డాక్టర్ సృజన్ మాట్లాడుతూ వయస్సు, లింగ భేదం లేకుండా ఎవరైనా నేత్రదానం చేయవచ్చు. కళ్ళద్దాలు ధరించేవారు, మధుమేహం, అధిక రక్తపోటు మొదలైన సమస్యలతో బాధపడేవారు, కంటిశుక్లం శస్త్రచికిత్స చేయించుకున్నవారు కూడా కళ్ళను దానం చేయవచ్చు. ఎయిడ్స్ (HIV) , రేబిస్ , హెపటైటిస్ బి/సి, సెప్సిస్ లేదా కొన్ని రకాల క్యాన్సర్లు ఉన్నవారు నేత్రదానం చేయడానికి అనర్హులు. మరణించిన తర్వాత 4 నుండి 6 గంటల లోపు కళ్ళను సేకరించాల్సి ఉంటుందని కావున వ్యక్తి మరణించిన వెంటనే స్థానిక ఐ బ్యాంకుకు సమాచారం అందించాలని కోరారు. నేత్రదానం ప్రాముఖ్యత చాలామందికి తెలవదని అన్నారు. కళ్ళు తొలగించడం వల్ల ముఖం వికృతంగా మారదు. లక్షలాది మంది భారతీయులు కార్నియల్ అంధత్వంతో బాధపడుతున్నారు. సేకరించిన కళ్ళు ద్వారా అంధత్వం ఉన్నవారికి అమర్చి వారికి చూపు ప్రసాదించవచ్చు అని పేర్కొన్నారు. నేత్రదానం చేద్దాం.. చూపును పంచుదాం! అని అవగాహన ర్యాలీ ని జడ్పీ సెంటర్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ మానుకొండ వీరభద్రం మరియు వాసవి ఐ కేర్ హాస్పిటల్ ఖమ్మం బృందం పాల్గొన్నారు.