బీసీ హక్కుల సాధన సమితి జిల్లా మహాసభలు జయప్రదం చేయండి

బీసీ నేత ధనుంజయ నాయుడు విజ్ఞప్తి
ఈనెల 13వ తేదీన కోదాడ మున్సిపల్ పరిధిలోని బాలాజీ నగర్ ఎల్ఐసి బిల్డింగ్స్ లో జరగనున్న బీసీ హక్కుల సాధన సమితి మూడవ జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు కోరారు. శుక్రవారం నాడు ఆయన గరిడేపల్లి మండల కేంద్రంలో బీసీ హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు దంతాల రాంబాబు తో కలిసి పాత్రికేయుల తో మాట్లాడుతూ... కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం జన గణనలో కుల గణన చేపడతామని ప్రకటించడం బీసీల విజయమని, కేవలం కుల గణన తోటే సరిపెట్టకుండా జనాభా దామాషా ప్రకారం 56% గా ఉన్న బీసీలకు విద్య ఉపాధి ఉద్యోగ రంగాలతో పాటు చట్టసభల్లోనూ అంతే దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ప్రతి బడ్జెట్లోనూ జనాభా దామాషా ప్రకారం ఆయా కులాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని అలాగే కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న బీసీ విద్యార్థుల 4000 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు చెల్లించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో గురుకుల పాఠశాలకు కళాశాలలకు సొంత భవనాలు నిర్మించాలని ఆయన విజ్ఞప్తి చేశారు,
బీసీల అభివృద్ధి కొరకు ఈ మహాసభలో చర్చించి పోరాట కార్యక్రమాలను రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు