అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులను వేగవంతం చేయాలి
వేసవిలో నీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలి
వేసవి తాగునీటి ఎద్దడి నివారణకు పకడ్బందీ ప్రణాళిక
* ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
* మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది
వేసవిలో నీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది ఆదేశించారు. మంగళవారం బాలాజీ గ్రాండ్ బ్యాకేట్ హాల్ లో మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్, మున్సిపల్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
వేసవి కాలంలో త్రాగునీటి ఎద్దడి రాకుండా ఆర్డబ్ల్యూఎస్ మరియు పబ్లిక్ హెల్త్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వేసవి ప్రారంభమైన దృష్ట్యా నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్న విలీన గ్రామాలలోని వార్డులలో ముందస్తుగా గుర్తించి ప్రణాళిక బద్దంగా మిషన్ భగీరథ నీరు క్రమం తప్పకుండా సరఫరా అయ్యేలా చూడాలని అన్నారు.
గత సంవత్సరం నీటి ఎద్దడిని ఎదుర్కొన్న వార్డులలో సమస్య పునరావృతం కాకుండా చూడాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. మిషన్ భగీరథ ఏఇలు క్షేత్ర స్థాయిలో తిరిగి త్రాగునీటి సరఫరాలో ఉత్పన్నమయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి సరిచేయాలని అన్నారు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలనీ తవ్విన గోతులను వెంటనే పూడ్చి, రోడ్లను యథాస్థితికి తీసుకురావాలని. పనులపై ఎప్పటికప్పుడు మున్సిపల్ అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సిహెచ్ హన్మంతరెడ్డి, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ అధికారులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.