సీజనల్ వ్యాధులను అరికట్టాలి. వైద్య సమస్యలు పరిష్కరించాలి

ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్) జిల్లా ఉపాధ్యక్షులు ముసలి సతీష్
చర్ల జులై 13
భద్రాచలం నియోజకవర్గ దుమ్ముగూడెం, చర్ల ఏజెన్సీ మండలాలలో వర్షాకాలం నేపధ్యంలో సీజన్ వ్యాధులు ప్రారంభలే అవకాశం ఉందని ప్రగతిశీల యువజన సంగం పీ వై ఎల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ ముసలి సతీష్ అన్నారు. ఈ సందర్భంగా చర్ల మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గోదావరి వరదల కారణంగా ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాలలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ తదితర విష జ్వరాలు విజృంభించే ప్రమాదం ఉందనీ వెంటనే సీజనల్ వ్యాధులను అరికట్టే చర్యలను ప్రభుత్వం చేపట్టాలని సతీష్ అన్నారు. గ్రామాలలో పంచాయితీ పాలకవర్గాలు లేకపోవడం మూలంగా పారిశుద్ధ్య సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లు తీవ్రంగా సమస్యలు ఉన్నాయన్నారు. వెంటనే గ్రామాలలో పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలని, బ్లీచింగ్ పౌడర్, చల్లించి, దోమల మందు పిచికారి చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో అనేకమంది ఆదివాసీలు, గిరిజనులు, అమాయక పేద ప్రజలు విష జ్వరాల బారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారని, విపరీతంగా దోమలు వ్యాప్తి చెంది రకరకాల జబ్బులు వచ్చి ప్రాణాలు కోల్పోతున్నరని, వెంటనే దోమతెరలను పంపిణీ చేయాలన్నారు. చర్ల మండలంలో పల్లె దవాఖానాలు మొదలుకొని మండలకేంద్రంలో ఉన్న పీ హెచ్ సీ సెంటర్లు అనేక సమస్యలతో నడుస్తున్నాయని, చర్ల దుమ్ముగూడెం మండల కేంద్రాలలో 24 గంటల వైద్య సదుపాయం కల్పించాలని, ప్రభుత్వ వైద్య రంగంలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి, సిబ్బంది కొరత లేకుండా చూడాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచి, అన్ని రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడం మూలంగా ప్రజలు ప్రైవేటు వైద్యశాలలకు వెళ్తున్నారని, ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులలో విపరీతమైన బిల్లులు వేసి ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారని ముసలి సతీష్ అన్నారు. వైద్య రంగ సమస్యలు పరిష్కరించే వరకు ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) దశల వారి ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.