యుద్ధ వ్యతిరేక శాంతి ర్యాలీని జయప్రదం చేయండి
అఖిలపక్ష రాజకీయ పార్టీలు,సామాజిక ప్రజా సంఘాలు
జోగులాంబ గద్వాల 2 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ నెల 6 న జరిగే యుద్ధ వ్యతిరేక శాంతి జయప్రదం చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా రాజకీయ పార్టీలు, సామాజిక ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. గురువారం జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వాళ్ళు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ చేస్తున్న సామ్రాజ్యవాద దాడులకు వ్యతిరేకంగా, ప్రపంచ శాంతిని కోరుతూ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నిర్వహించు శాంతి ర్యాలీలో జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అమెరికా చేస్తున్న వలసవాద, సామ్రాజ్యవాద దాడుల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధాల వల్ల లక్షల సంఖ్యలో చిన్నారులు, వృద్ధులు, ప్రజలు మరణిస్తున్నారని, కోట్లాది మంది నిరాశ్రయులు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో నిరంతరం కొనసాగుతున్న యుద్ధాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా నిరుద్యోగం పెరిగి, నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి ప్రజల జీవన వ్యయం విపరీతంగా పెరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
యుద్ధాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరోగమనం బాట పడుతుందని, ఈ ప్రభావం భారతదేశం పై కూడా పడుతుందని అన్నారు ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఈనెల 6న అనగా సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు గద్వాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ నుండి ర్యాలీ ప్రారంభమై పాత బస్టాండ్ లోని వైయస్సార్ విగ్రహం ముందు వరకు కొనసాగుతుందని తెలిపారు . ఈ ర్యాలీకి ప్రజలందరూ అధిక సంఖ్యలో హాజరై యుద్ధ వ్యతిరేక వైఖరిని కొనసాగించి, ప్రపంచ శాంతి కోసం చేసే పోరాటంలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ సమావేశంలో అఖిలపక్ష పార్టీల నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు,ప్రభాకర్,ఏ. వెంకటస్వామి, కుర్వ పల్లయ్య, ఉప్పేర్ నరసింహ,వినోద్ ,హుస్సేన్, వాల్మీకి ,మోహన్ తదితరులు పాల్గొన్నారు.