మావోయిస్టులు ప్రభుత్వం మధ్య నలుగుతున్న సమస్య ప్రజాక్షేత్రంలో పరిష్కరించబడాలి.
మావోయిస్టులు ప్రభుత్వం మధ్య నలుగుతున్న సమస్య ప్రజాక్షేత్రంలో పరిష్కరించబడాలి.అధికారం ఉందని ప్రభుత్వాలు ప్రజల కోసమే పోరాటమని మావోయిస్టులు పంతం పూ నితే విజ్ఞత గల సమాజం ఎలా అవుతుంది?* శాంతిభద్రతల సమస్య కాదు సామాజిక ఆర్థిక సమస్యని గుర్తించడమే విజ్ఞతనిపించుకుంటుంది*.
-వడ్డేపల్లి మల్లేశం
---26....05....2025
2025 మే మాసంలో మావోయిస్టులకు పోలీసు బలగాలకు సాగుతున్న యుద్ధం నష్టపోతున్న వైనం మానవ వనరులను గుర్తించకుండా ప్రభుత్వ వింత ధోరణి చావును సైతం లెక్కచేయకుండా లక్ష్యం కోసమే పని చేసే మావోయిస్టుల ధోరణి సమాజాన్ని కకావికలం చేస్తున్నది. వరుస ఎన్కౌంటర్లతో వందలాది మంది మావోయిస్టులు చనిపోతూ ఉంటే కొందరు లొంగుబాటు మరికొందరిని అరెస్టు ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల పోలీసు బలగాల సహకారంతో అణచి వేస్తూ లక్ష్యానికి చేరువవుతున్న సందర్భంలో ఈ అంశం కేవలం శాంతిభద్రతల సమస్యగా గుర్తిస్తే పరిష్కారం దొరకదు. ఇది ప్రజల అసమానతలు అంతరాలు పేదరికము నిరుద్యోగము ఆకలి చావులు ఆత్మహత్యలు మానవాభివృద్ధికి దూరంగా జీవిస్తున్న ప్రజల సమస్యగా గుర్తించినప్పుడు మాత్రమే పరిష్కారం దొరుకుతుంది. 2024 జనవరి నుండి ఇప్పటివరకు 400 మంది మావోయిస్టులు మృత్యువాత పడితే 2014 నుండి నేటి వరకు అంటే ఇరవై ఒక్క సంవత్సరాలలో సుమారు 1700 మందికి పైగా మావోయిస్టులు నేలకొరిగిన విషయాన్ని సమాజం గమనించాలి. ఆలోచించాలి. 1967 లో పశ్చిమ బెంగాల్లో ప్రారంభమైనటువంటి రైతు ప్రజా ప్రతిఘటన ఉద్యమం భూస్వాముల పైన ఎక్కుపెట్టిన తీరు నక్షల్బరి అనే గ్రామంలో ఆ ఉద్యమం ప్రారంభం కావడంతో ఉద్యమకారులకు నక్సలైట్లు అని పేరు ముద్ర పడిన విషయాన్ని కూడా మనం గమనించాలి. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1980 ప్రాంతంలో పీపుల్స్ వారు పేరుతో విప్లవ ఉద్యమం ప్రారంభమైతే 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యమకారులతో ప్రభుత్వం జరిపిన చర్చల సందర్భంగా కొంత స్తబ్దత నెలకొనడం ఒక నిర్ణయానికి రాలేకపోవడం జరిగింది.అదే సందర్భంలో పీపుల్స్ వార్ ఇతర మావోయిస్టు ఉద్యమ సంస్థలతో కలిసి మావోయిస్టుల పేరుతో ఉద్యమాన్ని ఆనాటి నుండి నేటి వరకు కొనసాగించడం జరుగుతున్నది. "ఇది కొన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వానికో సంబంధించినది కాదు, ఇది కేవలం మావోయిస్టుల వ్యక్తిగత అంశం అంతకు కాదు. ప్రజల దైనందిన సమస్యలతో పాటు అణచివేతకు గురవుతున్నటువంటి వివక్షతతో తమ ఉనికి ప్రశ్నార్ధకమవుతున్న కొన్ని వర్గాలను ప్రధానంగా చేసుకొని అసమానతలు అంతరాలు వివక్షత లేని సమానత్వం ప్రాతిపదికన సమ సమాజం కోసం పోరాడుతున్నటువంటి ప్రజా ఉద్యమకారులే నేటి మావోయిస్టులు అనే విషయాన్ని గుర్తిస్తేనే ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని వెతకవచ్చు. "
ఘర్షణకు కారణాలు : జార్ఖండ్, ఛత్తీస్గడ్, మహారాష్ట్ర, బీహార్, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ వంటి మధ్య భారతానికి సంబంధించిన రాష్ట్రాలలో ప్రధానంగా ఈ ఉద్యమం కొనసాగుతున్నది. ఇక్కడ ముఖ్యంగా ఆదివాసుల నివాస ప్రాంతాలలో అనేక రకాలైనటువంటి ఖనిజాలు అందుబాటులో ఉన్నాయని ఆదివాసులను ఈ ప్రాంతం నుంచి పంపించగలిగితే ఈ ఖనిజ వనరులను పెట్టుబడిదారీ బహుళ జాతి సంస్థలకు అప్పగించడం ద్వారా తమ ప్రాభవాన్ని కాపాడుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పండుతున్నాయని అందుకోసమే తమ పోరాటమని మావోయిస్టులు అనేక సందర్భాలలో స్పష్టం చేయడం జరిగింది. మేధావులు బుద్ధి జీవులు, సామాజికవేత్తలు కూడా ఈ విషయo పై స్పష్టత ఇచ్చిన విషయం అనేక సందర్భాలలో మనకు తెలుసు. తొలినాల్ల లో ఈ ఉద్యమంలో అనేకమంది మేధావులు, విద్యావంతులు తమ విద్యను వృత్తిని వదిలి ఈ సంస్థలో చేరినట్లు మనకు తెలుస్తుంది. అదే క్రమంలో ప్రభుత్వాలు కూడా ఈ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నంలో భాగంగా ఎన్కౌంటర్లతో వీరిని అంతం చేసే పనిని యదేచ్చగా కొనసాగించినట్లు విప్లవో ద్యమకారులు విమర్శిస్తున్నారు. " ఒక లక్ష్యాన్ని అభిప్రాయాన్ని కలిగి ఉండి సామాజిక పరిణతికి అసమానతలు లేని సమ సమాజ నిర్మాణానికి తమ జీవితాన్ని అంకితం చేస్తున్న వాళ్లు ఏ రకంగా దేశద్రోహులవుతారు? ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రశ్న, ప్రతిఘటన, విమర్శ కనీసమైన అంశాలు. విజ్ఞత కలిగిన ప్రభుత్వాలు ప్రశ్నకు సమాధానం చెప్పే కోణంలో ఆలోచించి చర్చలకు సిద్ధమని ప్రకటించడం ద్వారా వాళ్ల మనోభావాలను ఆలోచన ధోరణి డిమాండ్లను గుర్తించడానికి వీలవుతుంది. అదే సందర్భంలో ప్రభుత్వాలు కూడా తమ పాలనా అనుభవాలు, పరిపాలన ధోరణి,ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు ఏరకంగా పాల్పడుతున్నారో ఆ అంశాల పైన కూడా ఇలాంటి సమావేశాలలో చర్చ జరిగే అవకాశం ఉంటుంది కనుక మేధావులు బుద్ధి జీవులు తప్పనిసరి."
" 2004 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో నక్సలైట్లకు ప్రభుత్వానికి చర్చలు జరగడం అవి అర్ధాంతరంగా ఆగిపోవడం మనందరికీ తెలుసు. మూర్ఖపు ఆలోచనలతో తమ పట్టుదల నెగ్గాలని ఏ వర్గము చూసినా అది ఒంటెద్దు పోకడే అవుతుంది. కాబట్టి రెండు వర్గాలు కూడా చర్చల పట్ల సానుకూల వైఖరిని ప్రదర్శించాలి ప్రజాస్వాంక దృక్పథానికి మించిన ఆలోచన లేదు అనే సిద్ధాంతానికి కట్టుబడి ఉంటే తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ఏ లక్ష్యాల కోసం ఉద్యమం నిర్వహిస్తున్నారు? బలిదానాలు కావలసిన అవసరమేమిటి? ప్రభుత్వం ఒంటెద్దు పోకడగా ఎందుకు అంతం చేస్తున్నది? చంపకుండా చర్చలు చేయడం ద్వారా పరిష్కారం సాధ్యం కాదా? అనే విషయాలను సమాజం ప్రధానంగా పరిశీలించాలి. చర్చించి రెండు వర్గాలకు కూడా హెచ్చరిక చేయాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. " "సమాజంలోని భిన్న వర్గాలు మేధావులు ప్రజాస్వామి కవాదులు ఉద్యోగులు వ్యాపారులు ఎవరైనప్పటికీ అట్టడుగు ఆదివాసీలు పేద వర్గాల కోసమే మావోయిస్టులు పనిచేస్తున్నారు అన్న విషయం నగ్న సత్యం కనుక వారి లక్ష్యాన్ని చర్చల క్రమంలో ప్రభుత్వం ముందు ఉంచడానికి ఈ వర్గాలు ఎందుకు ప్రయత్నించడం లేదు? తమకు పట్టనట్లుగా ఎందుకు వ్యవహరిస్తున్నాయి? ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. పాఠశాల వయస్సు ప్రాంతంలో ఇంటికి దూరమై, ఉద్యమంలో చేరి,సామాజిక స్పృహతో ఉద్యమానికి అంకితమై పని చేసి, కుటుంబానికి తల్లిదండ్రులకు వ్యవస్థకు దూరంగాచె ల్లా చెదు రై పోయి ఎంతోమంది శవాలుగా ఇంటికి వస్తున్న పరిస్థితిని గమనిస్తే వీళ్ళ త్యాగాలకు సిద్ధాంత పరిజ్ఞానానికి ఫలితం ఏది? అని ప్రశ్నించుకోవలసి వస్తున్నది". గత రెండు సంవత్సరాలుగా దేశంలో యదేచ్చగా హత్యాకాండ కొనసాగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం తన తనదైన శైలిలో 2026 మార్చినాటికి మావోయిస్టులను పూర్తిగా అంతం చేస్తామని ఆ వైపుగా కార్యాచరణ ప్రకటించడం అంటే సమస్య పరిష్కారం కంటే, సానుకూలమైన వాతావరణాన్ని కల్పించడం కంటే, సమ సమాజం స్థాపించడం కంటే కేవలం ఉద్యమాన్ని అణచడమే తమ లక్ష్యంగా కనిపిస్తున్నది. ఇది ప్రజాస్వామ్య దృక్పథానికి ఏ రకంగా సరిపోతుందో ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. ఫిబ్రవరిలో ఒకసారి ఇటీవల రెండుసార్లు మావోయిస్టులు లేఖల ద్వారా తమ సానుకూల దృక్పథాన్ని చర్చలకు ప్రభుత్వాన్ని అంగీకరింప చేయాలని కోరిన విషయం మనకు తెలుసు. కాల్పుల విరమణ ప్రకటించడం ద్వారా తమను చర్చలకు పిలిస్తే తప్పకుండా చర్చల్లో పాల్గొంటామని ఈ ఉద్యమానికి సంఘర్షణకు సంక్లిష్ట పరిస్థితికి పరిష్కారాన్ని వెతకడంలో తమ వంతు పాత్ర పోషిస్తామని ప్రకటించినప్పటికీ వాళ్ళ పక్షాన శాంతి సంఘాలు మేధావులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రభుత్వాలు కాల్పుల విరమణ ప్రకటించకపోగా మరింత ఎక్కువగా కొనసాగించడాన్ని మనం గమనించవచ్చు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి కేంద్రంతో సహా ఈ ఉద్యమానికి అనుసంధానంగా ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మేధావులు శాంతి కమిటీ లు కాల్పుల విరమణ ప్రకటించాలని మావోయిస్టులతో చర్చలు జరపాలని సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం వెతకాలని గత నాలుగైదు మాసాలుగా చేస్తున్న కృషిని ప్రభుత్వాలు గుర్తించకపోవడం. విచారకరం. ఈ ఘర్షణను మనకు సంబంధం లేనిధిగా భావించి భయపడడం కంటే అటు ప్రభుత్వాలకు ఇటు ఉద్యమ సంస్థలకు విజ్ఞప్తి చేయడం ద్వారా ఒక సానుకూలమైన వాతావరణాన్ని కల్పించవలసినటువంటి సామాజిక బాధ్యత పౌర సమాజం పైన ఉన్నది అనేది నిర్వివాదాoశం. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా కాకుండా భారత సర్వోన్నత న్యాయస్థానం అనేకమార్లు ప్రకటించినటువంటి పద్ధతిలో భావ ప్రకటన స్వేచ్ఛ, సానుకూల దృక్పథం, అభ్యుదయ మార్గంలో ఆలోచించడం వంటి అభిప్రాయాలను కలిగి ఉండడం తప్పు కాదని చేసిన హెచ్చరికను ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు న్యాయవ్యవస్థ కూడా గుర్తించి ఈ హత్యాకాండను ఆపవలసిన బాధ్యత సంబంధిత వర్గాలపైన ఉన్నది అని గుర్తిస్తే మంచిది. ముఖ్యంగా న్యాయవ్యవస్థ ఈ అంశంలో జోక్యం చేసుకుంటేనే ఈ హత్యాకాండను ఆపగలము లేకుంటే అనేక రకాల విలువైన మానవ వనరులను అడ్డగోలుగా కోల్పోతే ప్రయోజనం ఏముంది? ప్రపంచ స్థాయిలో నరమేధం ఎక్కువగా ఉన్న దేశం భారతదేశం అని చెప్పుకోవడం తప్ప. ప్రజా సంఘాలు మేధావులు, పౌర హక్కుల సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకురావడం ద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రాన్ని ఒప్పించడానికి పెద్ద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. సంగీతానికి చింతకాయలు రాలునా అన్నట్లు విజ్ఞప్తి ప్రకటనలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపగలవా? అది సాధ్యం కాదు. ఒత్తిడి లేకుండా ఏ రకమైనటువంటి ప్రయోజనం ప్రజాస్వామిక దేశంలో సాధ్యం కాదు. అందుకు ప్రజా సంఘాలు అఖిలపక్షాలు మేధావులు హక్కుల సంఘాలు పెద్ద మొత్తంలో స్పందించాలి. మాట వరసకు మాట్లాడితే ప్రయోజనం లేదు అది ప్రభుత్వాలను స్పందించలేదు కూడా.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)