భూసారం క్షీణిస్తే ప్రజారోగ్యo సున్నా.ఎ రువులు క్రిమిసంహారక మందుల అతి వినియోగం, నేలకోత ప్రకృతి విపత్తులు కారణాలవుతున్నాయి.
భూసారం క్షీణిస్తే ప్రజారోగ్యo సున్నా.ఎ రువులు క్రిమిసంహారక మందుల అతి వినియోగం, నేలకోత ప్రకృతి విపత్తులు కారణాలవుతున్నాయి. దాని ప్రభావం మానవజాతి ఆరోగ్యంపై, పోషకాలు లేని ఆహారోత్పత్తి పై చూపుతున్న ప్రభావం ప్రమాదకరం.*
వడ్డేపల్లి మల్లేశం
10....01....2025
దేశాభివృద్ధికి ,ప్రజాస్వామ్య పరిరక్షణకు , దేశ ఉత్పత్తిలో భాగస్వాములు కావాలన్నా ప్రజల ఆరోగ్యం కీలకమైనది. ప్రకృతికి అనుసంధానమై జీవిస్తే మానవ ప్రగతికి డోకా లేదు కానీ ప్రకృతిని మానవుడు విధ్వంసం చేస్తూ, కలుషితం చేస్తూ నేలను కూడా విష తుల్యం చేయడం వల్ల అనేక పరిణామాలను మానవజాతి అనుభవించక తప్పడం లేదు. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం దక్కాలి.పోషకాహారం ఉత్పత్తి కావాలంటే భూసారం కల భూమిలో పంటలు పండాలి. పంటల్లో సారం ఉండాలంటే భూమిలో సారం ఉండాలి. భూసారాన్ని వివిధ రకాల అభివృద్ధి పేరుతో లేదా ఆధునిక పోకడల కారణంగా కోల్పోతున్న మనం తిరిగి కృత్రిమంగా వెతుక్కోవాల్సి రావడం విషాదకరం. వ్యవసాయ యోగ్యమైన భూములలో సూక్ష్మ స్థూల పోషకాల సమతుల్యత పైన పండించే పంటల్లో పోషకాలు ఆధారపడి ఉంటాయి .హరిత విప్లవం కారణంగా వ్యవసాయ రంగంలో భారతదేశం అభివృద్ధి చెందినదని చెప్పుకుంటున్నప్పటికీ అదే క్రమంలో రసాయన ఎరువులు పురుగు మందుల వాడకం అతిగా అమల్లోకి వచ్చినందున నేల తన సహజ గుణాలను కోల్పోయి భూసారం నశిస్తున్న కారణంగా కృత్రిమంగా ఎరువుల వాడకం పై రైతులకు పెట్టుబడి వ్యయం పెరిగిపోవడం వైఫల్యంగానే భావించాలి. అప్పుడు మాత్రమే ప్రకృతికి నష్టం చేయని రీతిలో భూసారాన్ని పరిరక్షించుకోవడానికి, కృత్రిమ ఎరువుల బదులు సేంద్రియ ఎరువుల ద్వారా వ్యవసాయాన్ని ముమ్మరం చేయడానికి ఆస్కారం ఉంటుంది.
భూసారంపై ఇటీవలి అధ్యయనo వెల్లడించిన అంశాలు:- సుమారు రెండు సంవత్సరాల క్రితం జరిగిన అధ్యయనం ప్రకారం పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయాలంటే వాటిని పండించే భూముల లోపల కూడా పోషకాలు సమృద్ధిగా ఉండాలని చేసిన సిఫారసు ప్రధానమైనది. నేలలో సూక్ష్మ పోషకాల యొక్క లోపం కారణంగా ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నట్లు అధ్యయనం తెలపడం ఆందోళనకరమైన విషయం.
- నేలల్లో జింక్ శాతం తక్కువ ఉన్న చోట పిల్లలు వయసుకు తగ్గ బరువు లేరని మహిళల్లో ఎదుగుదల సమస్యలు ఉన్నాయని ఆధ్యయనం పేర్కొనడం ప్రమాదకర పరిస్థితిని సూచిస్తున్నది.
-- నేలలో ఇనుము తక్కువగా ఉంటే పిల్లలు, మహిళల్లో రక్తహీనతకు దారితీస్తుందని తెలిపిన ఆ పరిశీలన ప్రకారం భారతదేశంలోని సాగు భూములలో 35 శాతానికి పైగా జింకు 11 శాతం ఇనుము లోపం కలిగి ఉన్నాయి.
-- సూక్ష్మ పోషకాల లోపం పిల్లల తెలివితేటలు, నైపుణ్యాలు, రోగనిరోధక వ్యవస్థ పై ప్రతికూల ప్రభావం చూపుతుందని రక్తహీనత అధికంగా ఉన్న దేశాలలో భారతదేశం ఒకటని ఈ అధ్యయనం వెల్లడించింది.
-- 15 నుండి 49 వయస్సు మహిళల్లో 53% ఐదేళ్ల లోపు పిల్లల్లో 58.5% రక్తహీనతతో బాధపడుతున్నారని అధ్యయనం వెల్లడించింది.
ఈ అధ్యయనంలో భారతదేశ వ్యాప్తంగా 2.7 కోట్ల భూసార పరీక్షల వివరాలను ఉపయోగించి దాదాపుగా 3 లక్షల మంది పిల్లలు 10 లక్షల మంది మహిళల ఆరోగ్య వివరాలను విశ్లేషించడం ద్వారా కొన్ని ప్రతిపాదనలు చేసినట్లుగా తెలుస్తున్నది.
సూక్ష్మస్తూల పోషకాలపై దృష్టి సారించాలి, భూసా రపరీక్షలు, కొన్ని చర్యలు కీలకం :- ప్రధానంగా వ్యవసాయ సంబంధమైనటువంటి మొక్కలలోని జీవ రసాయన ప్రక్రియల లో కీలక పాత్ర పోషించే సూక్ష్మ పోషకాలను పంట భూముల్లో ఉండే విధంగా రైతులు చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు సంబంధించి వ్యవసాయ అధికారులు తగిన అవగాహన సహకారాన్ని ఇవ్వడం మరింత కీలకం. ముఖ్యంగా నత్రజని, భాస్వ రం, పొటాషియం వంటి స్థూల పోషకాలతో పాటు ఇనుము, మాంగనీస్, జింక్, బోరాన్, క్లోరిన్ వంటి సూక్ష్మ పోషకాలు కూడా పంటలకు చాలా అవసరం. ప్రపంచవ్యాప్తంగా వీటి లోపాన్ని మూడింట ఒక వంతు జనాభా ఎదుర్కొంటున్నట్లు దాని కారణంగా పోషకాలు లేని ఆహారం వల్ల వారి ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం పడుతున్నట్లు అభిప్రాయపడుతున్నారు.
ఈ పరిస్థితులలో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులను తీసుకురావడానికి భూసార పరీక్షలు కీలకమని ఏడాదికి ఒకసారి తప్పనిసరిగా చేయించుకొని భూమి నష్టపోయిన పోషకాలను గుర్తించి సరైన మోతాదుల్లో సేంద్రీయ పద్ధతిలో భర్తీ చేసుకోవడం కీలకమని శాస్త్రవేత్తలు, నిపుణులు సూచించిన ప్రకారంగా రైతులు పాటించాలి. అందుకు వ్యవసాయ అధికారులు తోడ్పడాలి. సేంద్రియ కంపోస్టును ఎరువుగా విరివిగా ఉపయోగించాలి, పచ్చి రొట్ట ఎరువులను అధికంగా వాడాలి, సేంద్రీయ పద్ధతిలో భూసారాన్ని పెంచడానికి చేసే కృషి దీర్ఘకాలం కొనసాగినప్పుడు మాత్రమే మంచి ఫలితాలు సాధ్యమని నిపుణులు తెలపడం ఒక హెచ్చరికగా భావించాలి. నేల కోతకు గురికాకుండా చూసుకోవడంతో పాటు పంటలను మార్చి మార్చి వేయడం వల్ల కూడా భూసారాన్ని రక్షించుకోవడానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది .
అయితే భూసార పరీక్షల అమలు విషయంలో మాత్రం ప్రభుత్వాలతో పాటు రైతులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఆశించిన స్థాయిలో పోషకాహారాన్ని ఉత్పత్తి చేయలేకపోతున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. సేంద్రియ ఎరువుల పైన దృష్టి సారించకుండా కృత్రిమ ఎరువుల వైపు రైతులు మరింత ఎక్కువగా మొ గ్గుచూపుతున్న కారణంగా కూడా ఆశించిన లక్ష్యం చేరుకోవడం లేదు. మరొక అంశం ఏమిటంటే భారతదేశంలోని మొత్తం భూగోళ విస్తీర్ణంలో 23% సాగు భూమి అనేక కారణాల వల్ల క్షీణతకు గురైనట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్న సందర్భంలో ఈ క్షణతకు ప్రధాన కారణాలైనటువంటి నిలకడ లేని వ్యవసాయ పద్ధతులు, మైనింగ్అ,డవుల నిర్మూలన పైన కూడా దృష్టి సారించకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు ఎదుర్కోక తప్పదు వ్యవసాయ రంగం. భూమి క్షీణతను అరికట్టడంతో పాటు సూక్ష్మస్తుల పోషకాలను సమీకరించే విషయంలో దృష్టి సారించడం, రసానిక ఎరువులు పురుగు మందుల వాడకాన్ని భారీగా తగ్గించడం, ఏడాదికోసారి భూసార పరీక్షలు చేసుకోవడం వంటి కనీస చర్యలను ప్రభుత్వ ఆధ్వర్యంలో తప్పనిసరిగా కొనసాగిస్తే కానీ ప్రజారోగ్యాన్ని సాధించలేము,. భూసారాన్ని కాపాడుకోలేము అని రైతులు ప్రభుత్వాలతో పాటు ప్రజలు సామాజిక అవగాహన గల ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తేనే దీనికి పరిష్కారం దొరుకుతుంది.