మాదకద్రవ్యాలు మానవ మనుగడకు ప్రమాదం
జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి యం హృదయ రాజు.
PNM ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపన్యాస పోటీలు.
జోగులాంబ గద్వాల 5 ఆగస్టు 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల మాదకద్రవ్యాల వాడకం మానవ మనుగడకు ప్రమాదకరమని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి హృదయ రాజు పేర్కొన్నారు. ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు జిల్లాస్థాయి లో నేటి యువత - మాదకద్రవ్యాలు - నివారణ చర్యలపై ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి హృదయ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. నేటి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో యువత ముందు బాగాన ఉండాలన్నారు. ఉపన్యాస పోటీల్లో పాల్గొన్న విద్యార్థిని, విద్యార్థులను అభినందించారు. ఈ పోటీలలో 84 మంది విద్యార్థులు పాల్గొని తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. కార్యక్రమంలో బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వీరారెడ్డి, అధ్యాపకులు అఖిలారెడ్డి, పవన్ కుమార్, ఖలీల్, ప్రజానాట్యమండలి జిల్లా గౌరవ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ ఆశన్న, జిల్లా నాయకులు తిమ్మప్ప, నరసింహ, ఏలియా పాల్గొన్నారు.