మహిళల భద్రతకు గద్వాల్ పోలీసుల కట్టుదిట్టమైన భరోసా
భయపడొద్దు – మౌనం పాటించొద్దు : షీ కి చెప్పండి – సేఫ్గా ఉండండి
నిర్భయంగా ఫిర్యాదు చేయండి... మీప్రతి అడుగులో షీ టీమ్ మీ నీడై! మీ వెంటే! మీ వెన్నంటే!
ఆకతాయిలకు తప్పించుకునే మార్గం లేదు – జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు
జోగులాంబ గద్వాల 7 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మహిళలు, యువతులు, బాలికలు ఆకతాయిల వలన గానీ, ఇతర రకాల వేధింపుల వలన గానీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే ఎలాంటి భయం లేకుండా పోలీసులను సంప్రదించాలని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు తెలిపారు. మహిళల రక్షణ కోసం జిల్లాలో షీటీమ్స్, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ టీంలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఒక ప్రకటనలో వెల్లడించారు.
విద్యార్థినులు, మహిళలు ఎక్కడైనా అన్యాయానికి గురైనప్పుడు మౌనంగా ఉండకూడదని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కళాశాలలు, పాఠశాలల్లో ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, కార్యాలయాల్లో వేధింపులు, బాలికలపై లైంగిక దాడులు వంటి ఘటనలు చోటు చేసుకున్న వెంటనే షీటీమ్స్ను ఆశ్రయించాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా షీటీమ్స్ ద్వారా మహిళల భద్రతపై 19 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. సోషల్ మీడియా వినియోగంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి మాధ్యమాల్లో ఫొటోలు, వీడియోలు పంచుకునేటప్పుడు వ్యక్తిగత భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మార్చి నెలలో షీటీమ్స్కు 02 ఫిర్యాదులు అందగా, 1 FIR నమోదు చేసి, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున 10 మంది ఆకతాయిలపై మరియు పై ఫిర్యాదులలో ఒకదానిని కలుపుకొని మొత్తం 11 పెట్టి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 106 హాట్స్పాట్లపై నిఘా ఉంచి, 10 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించినట్లు వివరించారు.
నేరుగా ఫిర్యాదు చేయలేని వారు 8712670312 ఫోన్ నంబర్కు లేదా డయల్ 100కు కాల్ చేసి సమాచారం అందించవచ్చని, వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ఒంటరిగా ప్రయాణించే మహిళలు T-SAFE యాప్ను వినియోగించుకోవాలని, అది భద్రతకు ఉపయోగపడుతుందని సూచించారు. “మహిళలపై వేధింపులకు పాల్పడితే తప్పించుకోలేరు… కఠిన చర్యలు ఖాయం” అని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.