వినియోగదారుల మన్నునలను పొందాలి
సూర్యాపేట:వినియోగదారులకు నాణ్యమైన సేవలందిస్తూ వారి మన్ననలను పొందాలని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బాలాజీ ఫంక్షన్ హాల్ సమీపంలో ఏర్పాటుచేసిన వైఎల్ఎం లోను కన్సల్టెన్సీ కార్యాలయాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉన్న నిపుణులు ఈ కన్సల్టెన్సీ ద్వారా ప్రజలకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తారని పేర్కొన్నారు.ప్రస్తుతం చాలా మంది రుణాల కోసం బ్యాంకులను సంప్రదించే సమయంలో ఏ బ్యాంకులో ఏ రకమైన రుణాలు లభిస్తాయి, వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి, నెలవారీ ఈఎంఐలు ఎంత వరకు ఉంటాయి వంటి అంశాలపై పూర్తి అవగాహన లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు సరైన సమాచారం లేకపోవడం వల్ల రుణాల మంజూరులో జాప్యం లేదా తిరస్కరణ వంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి అన్నారు.
ఈ నేపథ్యంలో వినియోగదారులు సరైన బ్యాంకులను ఎంపిక చేసుకోవడం, అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవడం, గృహ, వ్యాపార, వ్యక్తిగత తదితర రుణాలపై పూర్తి సమాచారం పొందడం కోసం వైఎల్ఎం కన్సల్టెన్సీ వారధిగా పనిచేయనుందని తెలిపారు. ఎల్లమ్మ దేవత ఆశీస్సులతో ప్రారంభమైన ఈ కన్సల్టెన్సీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, యువత స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తూ తమ కాళ్లపై తాము నిలబడేలా ప్రోత్సహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య, కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రెబెల్ శీను, యూత్ అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్, ఆలేటి మాణిక్యం, భార్గవ్, సతీష్, ఉప్పలయ్య, నిర్వహకులు కట్ట ప్రవీణ్ రెడ్డి, పోలేపాక చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.