బీసీ రిజర్వేషన్ పట్ల కేంద్రం చిత్తశుద్ధితో ప్రవర్తించాలి

బీసీ హక్కుల సాధన సమితి ధనుంజయ నాయుడు విజ్ఞప్తి
ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కులగణ ను చేపట్టి బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి అట్టి బిల్లును శాసనసభలో ఆమోదింపజేసి కేంద్రానికి పంపితే గత నాలుగు నెలల కాలంగా ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వం పెండింగ్ లో పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు అన్నారు. మంగళవారం నాడు ఆయన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గానుగ బండ గ్రామంలో బీసీ హక్కుల సాధన సమితి ముఖ్య నాయకులతో కలిసి పాత్రికేయులతో మాట్లాడుతూ... బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్రవ్యాప్తంగా బీసీలు ఉద్యమిస్తుంటే ఉద్యమాన్ని తప్పు దోవ పట్టించేందుకు ఒకపక్క బిజెపి ధర్నాలు చేయడం మరో పక్క బిఆర్ఎస్ అనుబంధ సంఘం తెలంగాణ జాగృతి వారు నిరాహార దీక్ష చేయడం చూస్తుంటే సురభి నాటకాలు గుర్తుకొస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. జనాభా దాబాషా ప్రకారం ఏ కులం జనాభా ఎంత ఉంటే శాస్త్రీయంగా ఆయా కులాలకు అదే దామాషా పద్ధతిలో విద్య ఉద్యోగం ఉపాధి రంగాల్లోనూ మరియు రాజకీయ రంగాలలో రిజర్వేషన్ కల్పిస్తే అందరికీ స్వాతంత్ర ఫలాలు అందుతాయని అందరూ ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం ఉంటుందని తద్వారా దేశం పురోగతి సాధిస్తుందని ఆయన అన్నారు జనాభాలో 50% పైగా ఉన్న బీసీలు అభివృద్ధి చెందకపోతే దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని, స్వాతంత్ర వచ్చి ఎనిమిది దశాబ్దాలు కావస్తున్న నేటికీ బీసీలు ఓట్లు వేసే యంత్రాలు గానే ఉన్నారని ఇకనైనా ఇప్పుడైనా బీసీలు కళ్ళు తెరిచి తమ న్యాయమైన హక్కులకై ఉద్యమించాలని, దేశవ్యాప్తంగా కులగణన జరిపి, చట్టసభల్లో అనగా పార్లమెంటు మరియు అసెంబ్లీలో 50% సీట్లు బీసీలకు రిజర్వ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు పాలక వీడు మండల సిపిఐ కార్యదర్శి ముళ్ల జానయ్య సిపిఐ జిల్లా సభ్య సభ్యులు యల్లావుల రమేష్ మెండే లింగరాజు జక్కుల రమణ పాల్గొన్నారు