ప్రజా రచయితలకు ప్రతిఘటనే కీలకం
అనివార్యమైతే ఓపిక పడితే తప్పులేదు కానీ ఆత్మగౌరవాన్నిఎవరు పణంగా పెట్టిన సహించరు.* ప్రజలను చైతన్యం చేసే క్రమంలో హద్దులు, ప్రశ్నించే సందర్భాన్ని హెచ్చరిస్తారు.*
**************
--- వడ్డేపల్లి మల్లేశం 9014206412
--- 10....02....2025******
సందేహంతోనే సమాధానం, అన్వేషణతోనే పరిష్కారం, ప్రశ్నతోనే జ్ఞాన విస్తృతి, అనివార్యమైతే ప్రతిఘటనతోనే లక్ష్యసిద్ధి ప్రకృతిలో సాధ్యమవుతున్న సందర్భాలు తెలియనివి కావు. లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎ క్కడ ఎదురు తిరగాలి? ఏ విషయంలో ఎ o తవరకు భరించాలి? అనే హద్దుల గురించి తెలిసినప్పుడు మాత్రమే విజయం చేకూరడానికి అవకాశం ఉంటుంది. ప్రజా రచయితలు ప్రజలను చైతన్యం చేసే క్రమంలో తమ సాహిత్యానికి ఈ అంశాలను ముడి సరుకుగా వెన్నుదన్నుగా భావిస్తారు. కొందరు తమ పనిని పూర్తి చేసుకోవడానికి ఇతరులకు ఎనలేని అవకాశాన్ని ఇవ్వడంతో పాటు అతిగా ఓపికను ప్రదర్శించి తమ అస్తిత్వాన్ని కోల్పోతారు. ఈ రకంగా అతి ఓపిక పట్టడంలో తప్పులేదు కానీ ఆ ముసుగులో ఆత్మ గౌరవాన్ని కోల్పోయే ప్రమాదం కూడా లేకపోలేదు. ఆత్మ న్యూనతకు గురైనా, ఆత్మాభిమానాన్ని కోల్పోయినా, ఆత్మగౌరవానికి భంగం కలిగినా పరిస్థితులతో పోరాటం చేసే క్రమంలో బలహీనతతో రాజీ పడినట్లే భావించవలసి ఉంటుందనేది చరిత్రకారులు సాహితీవేత్తల అభిప్రాయం .ప్రతి పనికి హద్దులు నిర్ణయించబడి ఉంటాయి ఏ విషయంలో ఎంత వరకు భరించాలి అనుభవించాలి హద్దు మీరితే ప్రశ్నించాలి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఫలితాలను రాబట్టడంలో క్రియాశీలక పాత్ర పోషించాలి అనేది సమయస్ఫూర్తి, క్రియాశీలత, సృజనాత్మకత పైన ఆధారపడి ఉంటుంది. ఈ లక్షణాలను ప్రతి వ్యక్తి కూడా తనలో పెంపొందించుకోవాలని ప్రజల పక్షాన గొంతుకగా నిలవాలని నిరంతరం సాహితీ లోకం జన సామాన్యాన్ని హెచ్చరిస్తూనే ఉన్నది. నివు రుగప్పిన నిప్పులాగా త మ నిజమైన ఉనికిని చాటుకోలేని స్థితిలో ఉన్న వ్యక్తులకు
సాహిత్యకారులు బాసటగా నిలవాలి. ఉత్తమ సాహిత్యం ప్రజల పక్షాన సృష్టించబడడం, రచయితలు కవులు కళాకారులు ఇచ్చే భరోసాను సామాన్య జనం అందుకోవడంతోనే లక్ష్య సిద్ధి సాధ్యమై వ్యవస్థలో మార్పుకు అంకురార్పణ జరుగుతుంది. "ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా "శ్రీ శ్రీ హెచ్చరిక మేరకు కొంతమంది మోసగాళ్ల వలన నిర్వీర్యం అవుతున్నటువంటి యువత సామాన్య జనానికి బాసటగా నిలవడం బుద్ధి జీవులు మేధావులు చరిత్రకారులు విద్యావేత్తల యొక్క కనీస బాధ్యత. పని చేసి పెట్టడమే ప్రతిభ సామాజిక బాధ్యత కానే కాదు. కార్యకర్తలను సైనికులుగా తయారు చేసే క్రమంలో ఎదురయ్యే ఆటంకాలను విప్పి చెప్పి ప్రశ్నించి ప్రతిఘటించి హక్కులను సాధించుకునే యుద్ధ వీరులుగా తీర్చిదిద్దేది నిజమైన సాహిత్యo అని చెప్పక తప్పదు .ప్రజల పక్షాన పని చేసే రచయితలు కళాకారులు కవులు నిరంతరము జాగరూకతతో బాధ్యతాయుతంగా ఉన్న పరిస్థితులను అవగాహన చేసుకుని మరింత మెరుగైన పరిస్థితులకు సమాజాన్ని నడిపించడానికి చేసే కృషి వల్ల రాణించగలుగుతున్నారు.
హద్దులు, ప్రశ్నించే సందర్భాన్ని గుర్తేరగాలి :-
************---------
సమస్య ఒకటే ఉన్నా పరిష్కారాలు ఎన్నో ఉంటాయి సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ పరిష్కారం ఒకే కోణంలో లభించే అంశాలు కూడా ఉంటాయి. ఈ సందర్భంలో సమస్య యొక్క హద్దులను గుర్తించడంతోపాటు ప్రశ్నించే సందర్భాన్ని మార్గ నిర్దేశం చేయడం అనేది మౌలికమైన అంశం. సామాన్య జనం కార్మికులు రైతులు చేతివృత్తుల వాళ్ళు చిరు వ్యాపారులు పేదవర్గాలు తమ నిత్య జీవిత అనుభవాలు జ్ఞాపకాల కృషిలో నిమగ్నమై ఉంటే మెజారిటీ ప్రజానీకం ఉత్పత్తి తో సంబంధం లేకుండా సంపదని సృష్టించే పనికి ఆస్కారం ఇవ్వకుండా కేవలం గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తూ నానా హంగామా కొనసాగిస్తారు. నిజం నిప్పులాంటిదని ఆలస్యంగా నైనా తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుంటుందని ఆశించి విశ్వసించే వాళ్ళు, ఆలోచించి భంగ పడిన వారిని కూడా మనం చూడవచ్చు. ఒక్కో సారి మన శక్తిని యుక్తిని భావవేశాన్ని సమయస్ఫూర్తిని చూచుకొని మనమే నమ్మ లేక పోతాం. అయితే ఈ నిర్లక్ష్యం గనుక నిరంతరం కొనసాగితే మనిషి అచేతనంగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. వృద్ధులను పెద్దలను నిరంతరం మాట్లాడనిస్తే తమ భావాన్ని వ్యక్తపరిచే అవకాశం కల్పిస్తే భాషను భావావేశాన్ని ప్రేమలు ఆత్మీయతలు అనుభూతులు అనుభవాలను నిక్షిప్తం చేయడానికి అవకాశం ఉన్నట్లే సామాజిక అవగాహనను పెంపొందించే పలు కార్యక్రమాలలో ప్రజలను నిరంతరము భాగస్వాములను చేయడం ద్వారా అనేక సవాల్ల ను చవి చూడడానికి, త దనుగుణంగా పరిష్కారాలను వెదక వెతకడానికి, సమయస్ఫూర్తిని ప్రదర్శించి తన శక్తియుక్తులను ధారపోయడానికి అవకాశం ఉంటుంది. ఆ క్రమంలో వెలుగు చూసినటువంటి అన్వేషణ ద్వారానే ఈనాడు మనం అనుభవిస్తున్నటువంటి అనేక ఆవిష్కరణలు, కొత్త సిద్ధాంతాలు, ప్రకృతి వనరులు సా కారమైన విషయాన్ని మరిచిపోకూడదు. మన ఆరోగ్యం మన చేతుల్లో అన్నట్లు ఈ వ్యవస్థ యొక్క మార్పు, ఉన్న స్థాయి నుండి మరింత ఉన్నత స్థానానికి చేరుకోవడం అనేది మన సామాజిక చింతన, అవగాహన, బాధ్యత, కలిగి ఉండే వైఖరులు, దృక్పదాలు, క్రమశిక్షణ పైన ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో రచయితలు కవులు కళాకారులు సమాజానికి మార్గ నిర్దేశం చేసే భిన్న వర్గాలు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఉత్పత్తిలో కృషిలో శ్రమలో పాల్గొని శ్రామికులు, ప్రజల జీవన విధానాన్ని సంస్కరించడానికి బాధ్యత నిర్వహిస్తున్నటువంటి అధికార యంత్రాంగం తో పాటు పాలకుల యొక్క నిబద్ధత చిత్తశుద్ధి పైన సామాజిక సంస్కరణ ఆధారపడి ఉంటుంది. ఈ సృష్టిలో ఏ ఒక్క దాని కంటే మరొకటి గొప్పది కానట్లే అన్ని అవసరమైనట్లే అన్ని వర్గాలు కూడా సమన్వయంతో సవాలుగా స్వీకరించి ఉమ్మడి కృషిని కొనసాగించడం ఉద్యమాలను నడిపించడం పోరాట రూపాన్ని అవసరానుగుణంగా మార్చుకోవడం ప్రతిఘటన శక్తిని పెంచుకోవడం ద్వారా మాత్రమే ఈ వ్యవస్థ తన రూపాన్ని మరింత మెరుగుగా నిలబెట్టుకుంటుంది. ఏదీ తనంత తానై నీ దరికి రాదు శోధించి సాధించాలి అన్న శ్రీశ్రీ మాటలు గాని, ఈనాడు దున్నాల్సింది పొలాలను మాత్రమే కాదు వక్రమైన ఆలోచనలతో గూడు కట్టుకున్న మనుషుల మెదళ్లను కూడా అన్న ప్రముఖ అంబేద్కరిస్ట్ కత్తి పద్మారావు గారి సూచన గాని నేటి తరానికి ఎంతో దోహదపడుతుంది. ఆ వైపుగా సమాజం మనుగడ, ప్రగతికి మార్గ నిర్దేశం చేసిన భారతీయ ప్రముఖ రచయిత్రి సి. కె.మీనా ఘాటైన హెచ్చరికలను ఈ సందర్భంగా ప్రస్తావించుకోవడం పరిశీలించడం మన అందరి యొక్క కనీస బాధ్యత.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు అరసం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )