ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి:శృతి ఓజా
జోగులాంబ గద్వాల 22 మే 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల్. కొనుగోలు కేంద్రాల్లో మిగిలి ఉన్న ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా ప్రత్యేక అధికారిని, ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ శృతి ఓజా అధికారులకు సూచించారు.బుధవారం గద్వాల మండలం బీరెల్లి, లత్తిపురం గ్రామాలలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ తో కలిసి ఆమె సందర్శించారు. ఈ సందర్బంగా ఐకెపి ద్వారా నిర్వహిస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతుల సౌకర్యార్థం అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. ధాన్యం తరలించిన రైతులను పలకరించి, కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని ఆరా తీశారు. రైతులు ధాన్యం తీసుకువచ్చిన వెంటనే తూకం జరిపించాలని, సేకరించిన ధాన్యాన్ని వెనువెంటనే లారీలలో లోడ్ చేయించి రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. డాటా ఎంట్రీ పనులను ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ, రైతులకు వెంటనే డబ్బులు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అకాల వర్షాలు కురుస్తున్నందున ధాన్యం తరలింపులో జాప్యానికి తావులేకుండా చూడాలని అన్నారు. కొనుగోలు కేంద్రాలలో సరిపడా టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తి స్థాయిలో మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని ఆమె తెలిపారు. వర్షాల వల్ల ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత సీజన్ లో 70 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగినది, ప్రస్తుతం 10 కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం సేకరణ జరుపుతున్నామని, ఎక్కడ కూడా తరుగు వంటివి లేకుండా గట్టి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. కేంద్రాలలో రైతులకు అవసరమైన అన్ని సదుపాయాలూ అందుబాటులో ఉంచామని తెలిపారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకుని అధికారుల వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ముసిని వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ విమల, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.