ఢిల్లీ వేదికగా వేడెక్కిన తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు
కోకిల డిజిటల్ మీడియా
హైద్రాబాద్ న్యూస్ డెస్క్ :- తెలంగాణ కాంగ్రెస్లో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మరికాసేపట్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక సమావేశం జరగనుంది.
ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరుకానున్నారు.
తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ పనితీరుతో పాటు పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
ఈ సమావేశం నేపథ్యంలో కేసీ వేణుగోపాల్ తన నాసిక్ పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు మంత్రి కొండా సురేఖ మరికాసేపట్లో ఢిల్లీకి చేరుకోనున్నారు. కేసీ వేణుగోపాల్ను కలిసేందుకు ఆమె అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఢిల్లీలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. ఉదయం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమయ్యారు.
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంతో పాటు ప్రభుత్వ, పార్టీ పరమైన అంశాలపై కేసీ వేణుగోపాల్తో జరిగే భేటీలో కీలక చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కేసీ వేణుగోపాల్తో సమావేశం అనంతరం ఖర్గే నివాసంలో మరో కీలక భేటీ జరగనున్నట్లు సమాచారం.
ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న వరుస సమావేశాలతో తెలంగాణ కాంగ్రెస్లో తదుపరి పరిణామాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.