గోదావరి వరద ఉధృతిపై ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి
మూడవ ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలను వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.
తెలంగాణ వార్త జూలై 31 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం.
లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలి.
గోదావరి నదిలో వరద ఉధృతి మరింత పెరుగుతున్న నేపథ్యంలో భద్రాచలం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలను మరింత వేగవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. భద్రాచలం డివిజన్ పరిధిలోని చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, అశ్వాపురం, మణుగూరు, బూర్గంపాడు మండలాలకు చెందిన గోదావరి పరివాహక ప్రాంతాల అధికారులతో జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా వరద పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతోందన్నారు. సమ్మక్క బ్యారేజ్ వద్ద సుమారు 14. 6 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో భద్రాచలం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
గోదావరి పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు గ్రామాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రమాదం సంభవించే అవకాశమున్న ప్రాంతాల ప్రజలను ముందుగానే సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. గ్రామాల్లో టామ్టామ్ నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేయాలని, అధికారులు ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించేలా విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు.
గర్భిణీలు, వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ వారిని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ ఇప్పటివరకు 17 మంది గర్భిణీలను సురక్షితంగా ఆరోగ్య కేంద్రాలకు తరలించామని, మరో 10 మందిని తరలించే ప్రక్రియ కొనసాగుతోందని కలెక్టర్కు వివరించారు.
గోదావరి పరివాహక ప్రాంతాల్లో అవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంబులెన్స్లు, అత్యవసర మందులు సిద్ధంగా ఉంచాలని, వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.
వరద నీరు రహదారులపైకి వచ్చే అవకాశమున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి భారీ బారికేడ్లు ఏర్పాటు చేయాలని, పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పటిష్ట పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. వాగులు, వంకలు, వరద నీటితో నిండిన రహదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు దాటకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
ప్రజలు పర్యాటక ప్రాంతాలు, జలపాతాలు, వాగులు, నదీ తీర ప్రాంతాలకు వెళ్లకుండా అటవీశాఖ అధికారులు పోలీసు శాఖతో సమన్వయం చేసుకొని పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదకర ప్రాంతాల్లో బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ సందర్శకులను అనుమతించరాదని స్పష్టం చేశారు.
వరద ప్రభావానికి గురయ్యే అవకాశమున్న వృద్ధాశ్రమాలు, పాఠశాలలు, విద్యాలయ వసతి గృహాలను ముందుగానే గుర్తించి అక్కడ ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు, వృద్ధులు, ఇతర బలహీన వర్గాల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.
పునరావాస కేంద్రాల్లో తాగునీరు, పరిశుభ్రమైన భోజనం, విద్యుత్, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, వైద్య సేవలు, మహిళలు, చిన్నారులు, వృద్ధులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. భద్రాచలం పట్టణంలో వరద ప్రభావిత ప్రజల కోసం మొత్తం తొమ్మిది పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అవసరమైతే అదనపు పునరావాస కేంద్రాలను కూడా సిద్ధంగా ఉంచాలని సూచించారు. పునరావాస కేంద్రాలకు తరలించిన ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాల్లోని ప్రతి గ్రామంలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని, ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ప్రజల ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు.
టెలి కాన్ఫరెన్స్లో సంబంధిత శాఖల జిల్లా అధికారులు, భద్రాచలం డివిజన్ పరిధిలోని ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, పోలీసు, వైద్య ఆరోగ్య, అటవీ, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ భద్రాచలంలో స్నాన ఘట్టాల వద్ద వరద గోదావరి ఉధృతిని పరిశీలించి సహాయక చర్యల గురించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. జిల్లా ఎస్పీ కూడా పాల్గొన్నారు.
ఎండ్