ఆర్టిజన్ కార్మికులను అరెస్ట్
ఖైరతాబాద్లో మహాధర్నాకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
అడ్డగూడూరు 22జూలై 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను బుధవారం రోజు ఉదయం నుండి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.హైదరాబాద్ ఖైరతాబాద్లోని విద్యుత్ ప్రధాన కార్యాలయం ముందు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 20,వేల మంది ఆర్టిజన్ కార్మికులు మహాధర్నా చేపట్టారు.ఈ ధర్నాకు హాజరుకాకుండా ఉదయం 5 గంటల నుండి అడ్డగూడూరుతో పాటు పలు ప్రాంతాల్లోని కార్మికులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడు తుప్పతి బీరప్ప మాట్లాడుతూ..గత 30 సంవత్సరాలుగా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులు తమ హక్కుల కోసం ఈ ధర్నా చేపట్టినట్లు తెలిపారు.గత ప్రభుత్వం విలీనం పేరుతో ఆర్టిజన్లకు బ్రిటిష్ కాలం నాటి నిబంధనలు అమలు చేసి అన్యాయం చేసింది.ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి,విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆర్టిజన్ల సమ్మె సమయంలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి 3నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదు.ఒకే సంస్థలో ఉండి కూడా వివిధ నిబంధనలు పెట్టి కార్మికులను శ్రమదోపిడి చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.ఇలా అరెస్టులు చేసి ఈరోజు ఆపవచ్చు కాని, సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి వెంటనే ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్టిజన్ నాయకులు రాజపేట శోభన్ బాబు,నూకల నరసింహ,గోలి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.