అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల పోషణతో పాటు నాణ్యమైన విద్యాతో తీర్చిదిద్దాలి
చిన్నారుల బరువు, ఎదుగుదలపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలి
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జోగులాంబ గద్వాల 28 జూలై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- పిల్లల పోషణతో పాటు వారి విద్యా పునాదులు బలంగా ఉండేలా అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన బోధన అందించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం గద్వాల మండలం చెనుగొనిపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం,విద్యా బోధన, తదితర వివరాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,పిల్లల భవిష్యత్తుకు పునాది అంగన్వాడీ కేంద్రాల ద్వారానే నిర్మితమవుతుందని అన్నారు. పిల్లలు క్రమం తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు.అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన విద్య, సామ్ - మామ్ స్టంటింగ్ సమస్యలు ఉన్న చిన్నారులను ముందుగానే గుర్తించి,వారికి ప్రత్యేక పోషకాహారం అందించి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే తల్లిదండ్రులకు సమతుల్య పౌష్టికాహారం,శిశు సంరక్షణ, ఆరోగ్యకరమైన అలవాట్లపై నిరంతరం అవగాహన కల్పించాలని చెప్పారు.అంగన్వాడీ కేంద్రాల్లోనే పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను సమర్థవంతంగా బోధించి భవిష్యత్తు విద్యకు బలమైన పునాది వేయాలని ఆదేశించారు. తనిఖీలొ భాగంగా పిల్లల బరువును పరిశీలించి, వయస్సుకు అనుగుణంగా ఎదుగుదల ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించి,వారి చదువు, ఆటపాటల గురించి అడిగి తెలుసుకున్నారు.పిల్లలు చురుకుగా ఉండడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, ఉపాధ్యాయులు ఇదే విధంగా బోధిస్తూ పిల్లలను మరింత చురుకుగా,క్రమశిక్షణతో తీర్చిదిద్దాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గద్వాల్ తహసీల్దార్ హరికృష్ణ, అంగన్వాడీ టీచర్,పిల్లలు, తదితరులు పాల్గొన్నారు.