8 దశాబ్దాల స్వతంత్ర భారతదేశంలో  అదుపు చేయలేని టైఫాయిడ్ . ప్రజారోగ్యం పతనమవుతుంటే,  

Mar 9, 2026 - 05:23
 0  1

8 దశాబ్దాల స్వతంత్ర భారతదేశంలో  అదుపు చేయలేని టైఫాయిడ్ . ప్రజారోగ్యం పతనమవుతుంటే,  

పరిసరాలు వాతావరణం కాలుష్యం అవుతుంటే  ప్రపంచంలోనే మూడవ ఆర్థిక వ్యవస్థ ఎలా అవుతుంది ? 

నిధుల కేటాయింపు, ఆధునికీకరణ  నిర్లక్ష్యమే కారణమా ?

___వడ్డేపల్లి మల్లేశం 


స్వతంత్ర భారతదేశంలో ప్రణాళిక బద్ధంగా  వ్యవసాయము, ఆరోగ్యము , పరిశ్రమలు , పేదరిక నిర్మూలన వంటి అనేక అంశాలకు  ప్రాధాన్యత క్రమంలో  నిధులను కేటాయిస్తూ అవకాశాలు కల్పించినప్పటికీ  8 దశాబ్దాల అనంతరం కూడా టైఫాయిడ్ పంజా విసురుతున్నదంటే  ప్రజారోగ్యం ఎంత నిర్లక్ష్యానికి గురవుతున్నదో అర్థం చేసుకోవచ్చు.  నీటిని సరఫరా చేసే శిథిలమైపోయిన పైప్లైన్లు మురుగు కాలువల కింద  లేదా వాటి పక్కన  ఉంటీ  తాగునీరు విషతుల్యమై  దేశవ్యాప్తంగా ను ఇటీవల ఇండోర్లో పదుల సంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకున్న సంగతి తెలుసు.  2024 సంవత్సరంలో 485 పట్టణాలలో కేంద్ర ప్రభుత్వం జరిపిన పరిశీలన సర్వే ప్రకారంగా  కేవలం 46 చోట్ల మాత్రమే రక్షిత నీరు సరఫరా అవుతున్నట్లు  మిగతా చోట్ల లీకేజీలు ఇతర అపరిశుభ్రత కారణంగా  తాగునీరు కలుషితమై రోగాల బారిన పడుతున్నట్లు జల్జీవన్ మిషన్ సర్వే ద్వారా  వాస్తవం వెలుగు చూసింది.  మరొక పక్కా విపరీతమైనటువంటి చెత్త ఎక్కడబడితే అక్కడ వేయడంతో జనావాసాలు త్రాగునీరు సరఫరాఅయ్యే ప్రాంతాలలో  మురికి కూపాలుగా  మారి నిండు ప్రాణాలను  బలిగొంటున్నాయి .

ఇక ప్రభుత్వ ఆలసత్వం , స్వార్థ ప్రయోజనాల కారణంగా చెరువులు నాళాల అక్రమ ఆక్రమణల కారణంగా  పట్టణాలు  నివాసాలు విస్తరిస్తున్న కారణంగా వరదలు పోటెత్తి  రోగాల బారిన పడక తప్పడం లేదు.  ఈ క్రమంలో భాగంగానే దేశ జనాభాలో అధిక శాతానికి పరిశుభ్రమైన నీరు, ఆహారము, పరిసరాలు అందుబాటులో లేని కారణంగా కలరా డయోరియా హెపటైటిస్ టైఫాయిడ్ వంటి అనేక భయంకరమైన రోగాలు  వ్యాపిస్తున్నాయి.  ఒక పరిశీలన ప్రకారంగా 2023 సంవత్సరంలో  టైఫాయిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఐదుగురిలో  ఒక్కరు తెలంగాణకు చెందిన వారిగా  అంచనా వేసినారంటే తెలంగాణలో ఉన్న  దుస్థితి అర్థం చేసుకోవచ్చు . భారత రిజిస్టా)ర్ జనరల్ కార్యాలయం ఇటీవల నిర్వహించిన నివేదిక ప్రకారంగా ఉత్తరప్రదేశ్లో టైఫాయిడ్ తో ఎక్కువ మంది చనిపోతే ఆ తర్వాత స్థానాల్లో తెలంగాణ పంజాబ్ ఉన్నట్లు  తెలుస్తుంది.  అంతెందుకు గడచిన ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 23 లక్షలకు పైగా టైఫాయిడ్ కేసులు నమోదైనట్లు  తెలుస్తూ ఉంటే టైఫాయిడ్ ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు  అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.  టైఫాయిడ్  వ్యాధి వ్యాప్తికి కారణమవుతున్నటువంటి సమస్యలు,  అనారోగ్య వాతావరణం,  మురికి నీరు, ఇతర  కారణాల పైన దృష్టి సారించాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది.


  టైఫాయిడ్ వ్యాప్తికి మరిన్ని కారణాలు

  ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా దశాబ్దాల తరబడిగా నాసిరకం పగుళ్లు ఏర్పడినటువంటి పైపులైన్ల ద్వారా వస్తున్న నీరు  కలుషితం కావడం ప్రధానం కారణం కాగా  మురుగు కాలువల సక్రమ నిర్వహణ లేకపోవడం కూడా దానికి తోడవుతున్నది.  మురుగునీరు ప్రవహించవలసినటువంటి కాలువలలో చెత్తను ఎక్కడికక్కడ పడవేయడంతో  విషతుల్యమై దుర్వాసన  ఇతర క్రిమి కీటకాల  వలన కూడా భయంకరమైన రోగాల బారిన ప్రజలు పడక తప్పడం లేదు.  రోగాలను అదుపు చేయడానికి తీసుకుంటున్న చర్యల కంటే రోగాలను  రెచ్చగొట్టే నిర్లక్ష్య  పరిస్థితుల కారణంగా  ప్రభుత్వాలు తీసుకుంటున్న ప్రజారోగ్య చర్యలు కార్యక్రమాలు  విఫలమవుతున్నట్లుగా తెలుస్తున్నది.  ఇక ఈ పరిస్థితులకు తోడుగా పాల నుండి మొదలుకుంటే ప్రతి వినియోగ వస్తువులు ఆహార పదార్థాల వరకు అన్నీ కల్తీమయం కావడం  హోటల్లో తినుబండారాల యజమానులు కూడా నాసిరకం చెడిపోయిన పదార్థాలతో వంటలు వండి  ఆకర్షణంగా తయారు చేసి జనంతో బలవంతంగా తినిపిస్తున్న కారణంగా కూడా  నాణ్యత కొరవడి  బ్యాక్టీరియా రోగకార క్రిములతో నిండి  ప్రమాదకరమైన ఆహారాల వల్ల కూడా టైఫాయిడ్ క్యాన్సర్లు వంటి అనేక రోగాలు తాండవిస్తున్నాయి.  

వినియోగదారులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడంతోపాటు తినుబండారాలు పోషక విలువలు ఆహార సామాగ్రిని  రక్షిత మంచినీరు సరఫరా చేయాల్సినటువంటి ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం కారణంగా కొంతమంది వ్యాపార వాణిజ్య  దారుల కుట్రపూరిత స్వార్థ ప్రయోజనాల వలన  వినియోగదారుల ఆరోగ్యం  నాశనమై పోతుంటే   కల్తీ ఆహారాన్ని చట్టబద్ధం చేస్తూ జనానికి అందిస్తున్న వారిపైన మాత్రం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శ సర్వత్ర వినపడుతున్నది.  పారిశుద్ధ్యము, మంచి నీటి సరఫరా, ఆరోగ్యము  వంటి అంశాలను మైంటైన్ చేయడం కోసం సెస్సు రూపంలో ప్రభుత్వాలు వసూలు చేస్తున్న నిధులు కూడా దుర్వినియోగం కావడం  ఒక అంశం కాగా 2018 _24 మధ్యన ఖజానాకు జమైనటువంటి విద్యా వైద్య సెసు రూపాయలు 37,537 కోట్లు కూడా  అవసరాలకు ఆయా రంగాలకు బదిలీ కాలేదని విమర్శ ప్రస్తుతం వినబడుతున్నది.

 ఒకవైపు నిర్లక్ష్యము మరొకవైపు వ్యాపారవేత్తల యొక్క స్వార్థ ప్రయోజనాల కారణంగా వాతావరణము ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు అనారోగ్యం పాలవుతూ ఉంటే  అదుపు చేయాల్సినటువంటి ప్రభుత్వాలు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరించడం, వసూలు చేసినటువంటి నిధులను కూడా సక్రమంగా ఆయా రంగాలకు మళ్ళించకపోవడంతో  ఆహారం తాగునీరు మొత్తం కలుషితమై ఆరోగ్యం దెబ్బతింటున్నట్లుగా ప్రభుత్వ సంస్థలే  హెచ్చరిస్తూ ఉన్నప్పుడు  కంచే చేను మేసినటువంటి పరిస్థితుల్లో ఇక కాపాడే వారెవరు అనేది ప్రశ్నార్థకంగా మారింది . ఈ పరిస్థితుల్లో పారిశుద్ధ్య విభాగానికి సంబంధించినటువంటి ఖర్చును  సక్రమంగా కొనసాగించడంతోపాటు  తాగునీటికి సంబంధించి వినియోగించే పైపులైన్లను ఎప్పటికప్పుడు ఆధునీకరించడం,  ఆహార పదార్థాలను తయారు చేసేటువంటి హోటల్లు తినుబండార్ కేంద్రాల లోపల నాణ్యతను పరీక్షించడం  అవసరమైతే తగిన చర్యలు తీసుకోవడంతో పాటు  కల్తీ కి ఆస్కారం లేనటువంటి విధంగా ఆహార పదార్థాల వినియోగం  బహిరంగ మార్కెట్లో కొనసాగేలా చూడాల్సిన అవసరం చాలా ఉంది.

ఇప్పటికీ మాంసాహారo విషయానికి వచ్చినప్పుడు  కోళ్లు గోర్లు ఇతర జంతువులను  చనిపోయిన వాటిని  నిర్లక్ష్యంతో మాంసానికి అందుబాటులో ఉంచుతున్న కారణంగా కూడా ఇలాంటి రోగాలు మరింతగా ముదిరి టైఫాయిడ్ ఇప్పటికీ కూడా నయం కాని రోగంగా మిగిలిపోయింది. అంటే  ప్రపంచంలోనే మూడవ ఆర్థిక వ్యవస్థ స్థాయికి చేరుకున్నప్పటికీ ఇంత దిగజారినటువంటి ఆరోగ్య పరిస్థితులున్నాయంటే వాస్తవం అర్థం చేసుకుంటే మనం తలవంచక తప్పడం లేదు.  ప్రభుత్వాల నిర్లక్ష్యముతో పాటు ప్రైవేటు వ్యాపారుల స్వార్థ పరత్వానికి ప్రజలు భలిగాకుండా చూడాల్సిన సామాజిక బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నది. ఆ బాధ్యత విస్మరిస్తే ఇక అనారోగ్య భారతమే.


(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333