పీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.2 లక్షల డీడీ అందజేసిన విశ్రాంత ఉపాధ్యాయుడు కాంతారెడ్డి
విశ్రాంత ఉపాధ్యాయుడిని ప్రశంసించిన జిల్లా కలెక్టర్
జోగులాంబ గద్వాల 8 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల.: నిస్వార్థంగా సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసే విశ్రాంత ఉపాధ్యాయుడు కాంతారెడ్డి లాంటి వ్యక్తులు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తారని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.
వడ్డేపల్లి మండలం కోయిలదిన్నె గ్రామానికి చెందిన రైతు, విశ్రాంత ఉపాధ్యాయుడు గోరంట్ల కాంతారెడ్డి సోమవారం ఐడిఓసి లోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కు పీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.2 లక్షల విలువైన డీడీ ను అందజేశారు. ఈయన గతంలోనూ సీఎం, పీఎం రిలీఫ్ ఫండ్ తో పాటు పలు ప్రభుత్వ సంస్థలకు తన సహకారాన్ని అందించారు. కాంతారెడ్డి తన ఉపాధ్యాయ పదవి విరమణ అనంతరం కూడా ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా జమ్మిచేడు, ఇర్కిచేడ్, కొండపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలలో గణితమును బోధించడం జరిగింది. ప్రస్తుతం వ్యవసాయం చేస్తూనే ఎర్రవల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు తెలుగు సబ్జెక్టును బోధిస్తున్నారు. కాంతారెడ్డి లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరమని, ఎందరికో ఆయన స్ఫూర్తిగా నిలుస్తారని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.