సాదా బైనామా భూములపై హైకోర్టుకు రిప్లై ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

సాదా బైనామా భూములపై తెలంగాణ ప్రభుత్వం ఇవాళ హైకోర్టుకు రిప్లై ఇచ్చింది. 12 ఏళ్ల పాటు భూమి స్వాధీనంలో ఉండి.. ప్రభుత్వం నిర్దేశించినట్టుగా రాత పూర్వక ఒప్పందం ఉంటే సాదా బైనామాలు చెల్లుతాయని ఏజీ కోర్టుకు విన్నవించారు.
2020లో సాదా బైనామాలను ఆపాలన్న మధ్యంతర ఉత్తర్వులు రద్దు చేయాలని ఏజీ ఈ సందర్బంగా కోర్టును కోరారు. అయితే, అడ్వకేట్ జనరల్ కౌంటర్కు రిప్లై ఇచ్చేందుకు పిటిషనర్లు సమయం కోరారు. దీంతో హైకోర్టు ఈ కేసు విచారణ ఈనెల 26 కు వాయిదా వేసింది.
సాదాబైనామా అంటే ఏమిటి?
పూర్వం కొందరు ఇతరుల నుండి భూమిని కొనుగోలు చేసినప్పుడు కేవలం కాగితాలపై ఒప్పందాలు, సంతకాలు మాత్రమే చేసుకునేవారు. అయితే ఇవి అధికారికం కాదు కావున, వీటిపై బ్యాంకులు లోన్స్ ఇవ్వవు. ఇలా రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండా సాగు చేసుకుంటున్న వారికి అప్పటి ప్రభుత్వం సాదాబైనామా అవకాశాన్ని కల్పించింది. ఇలాంటి భూములనూ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలు కల్పించడం ద్వారా ఎంతోమంది రైతులకు ఒక గొప్ప అవకాశం లభించింది.