రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి :
ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమన్వయ సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తెలిపారు.ఇందులో భాగంగానే ఈ రోజు జిల్లాతో సరిహద్దు కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారితో పాటు ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఐపీఎస్ కూడా పాల్గొన్నారు.ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున జిల్లాల సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద అధికారుల సమన్వయం పాటిస్తూ ఎప్పటికప్పుడు పకడ్బందీ చర్యలు చేపట్టేలా ఈ సమావేశంలో చర్చించారు.ఎన్నికల్లో అక్రమంగా నగదు మద్యం సరఫరాను నిరోధించేందుకు 12 ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్ లను,10 ఇంటర్ డిస్ట్రిక్ట్ బోర్డర్ చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు.చెక్ పోస్ట్ ల వద్ద విధులు నిర్వర్తించే అధికారులు మరియు సిబ్బంది అప్రమత్తంగా ఉండి 24/7 వాహన తనిఖీలు నిర్వహించాలని సూచించారు.ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల సంఘం అధికారులు చేపడుతున్న అన్ని చర్యలను నిశితంగా పరిశీలిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు.సరైన ఆధారాలు లేకుండా ఎవరైనా నగదు మరియు మధ్యాన్ని అక్రమంగా సరఫరా చేస్తూ పట్టుబడితే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఈ సందర్బంగా ఎస్పీ తెలియజేసారు.
ఈ సమావేశంలో పాల్వంచ డిఎస్పీ,జంగారెడ్డిగూడెం డిఎస్పీ మరియు పోలవరం డిఎస్పీ మరియు సరిహద్దు పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.