నూతన పెన్షన్లు,రేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయాలి.
సిపిఎం మండల కార్యదర్శి రొండి శ్రీనివాస్.

మాడుగుల పల్లి, 09 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- రాష్ట్రంలో నూతన పెన్షన్లు,రేషన్ కార్డులను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రొండి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం మండలంల కేంద్రంలోనిపాములపహాడ్ గ్రామంలో సిపిఎం పార్టీ ప్రజా పోరుబాటలో భాగంగా ఇంటింటికి సర్వే నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్లు,రేషన్ కార్డుల కోసం ప్రజలు చాలా సంవత్సరాల నుంచి దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్లు మంజూరు చేయకపోవడంతో వారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.అదేవిధంగా నూతనంగా వివాహం చేసుకున్న వారికి చాలా నూతన రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.అదేవిధంగా గ్రామాలలో స్థానిక సమస్యలు తాగు నీరు,సాగునీరు,సీసీ రోడ్లు,కరెంటు తదితర సమస్యలను ప్రస్తుతం గ్రామ ప్రత్యేక అధికారిగా ఉన్నటువంటి వారు ఎప్పటికప్పుడు గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.అదేవిధంగా గ్రామంలో అనేకమంది చదువుకున్న యువత ఉద్యోగాలు లేక కొంతమంది ఖాళీగా ఉంటున్నారు,మరి కొంతమంది కూలి పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీసుకుంటున్నారు.ప్రభుత్వం వెంటనే యువతకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా యూత్ డిక్లరేషన్ అమలు చేసి నిరుద్యోగ భృతి ,ఖాళీ ఉద్యోగాల భర్తీని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.అదే రకంగా మహిళలకు వడ్డీ లేని రుణాలను వెంటనే మంజూరు చేయాలని కోరారు.ఉపాధి హామీ పథకంలో భాగంగా 200 రోజుల పని కల్పించి రోజుకు కనీసం 600 రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.గ్రామ సమస్యల అధ్యయనంతో పాటుగా ప్రజా సంఘాల సభ్యత్వ నమోదులో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సభ్యత్వాలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలెబోయిన వరలక్ష్మీ,సీపీఎం మండల కమిటీ సభ్యురాలు తంగెళ్ళ నాగమణి, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు చింతచెర్ల శ్రీను,రైతు సంఘం మండల నాయకులు సబ్బు రవీందర్ రెడ్డి,పిండి వెంకట్ రెడ్డి,పిండి ఇందిరమ్మ,అలుగుబెల్లి వెంకట్ రెడ్డి,భద్రమ్మ,లక్ష్మీ,కోదాటి సోమయ్య తదితరులు పాల్గొన్నారు..