గోదావరి పుష్కరాల నాటికి ఆలయ తొలి దశ అభివృద్ధి పనులు పూర్తి..
రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ
అంగరంగ వైభవంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం
భద్రాచలం, మార్చి 27:- గోదావరి పుష్కరాల నాటికి ఆలయ తొలి దశ అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ తెలిపారు. శుక్రవారం భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అనంతరం మంత్రివర్యులు కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ భద్రాచలంలోని శ్రీ సీతారాముల వారి కళ్యాణానికి ప్రాముఖ్యత ఉందని, దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు శ్రీ సీత రామచంద్ర స్వామి కళ్యాణాన్ని వీక్షిస్తారని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడవ సంవత్సరం మంత్రిగా తాను ఈ కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో డిప్యూటీ సీఎం, స్థానిక మంత్రి వర్యుల సహకారంతో స్థానికంగా అవసరమైన భూ సేకరణ చేసిన తర్వాత, రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో మొదటి విడత క్రింద భద్రాచలం ఆలయానికి 351 కోట్ల రూపాయలతో చేపట్టే అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు.
గోదావరి పుష్కరాల సమయానికి ప్రస్తుతం చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు దేవాదాయ శాఖ కృషి చేస్తుందని అన్నారు. తర్వాత రెండవ విడత నిధులు విడుదల చేసుకొని కృష్ణ పుష్కరాల నాటికి
అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరుగుతుందని మంత్రి అన్నారు.
నేడు కళ్యాణ మహోత్సవాన్ని తిలకించిన భక్తులందరికీ శ్రీ రామచంద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని, ప్రజా ప్రభుత్వానికి శ్రీరామచంద్రమూర్తి శక్తిని కల్పించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆశీర్వదించాలని మంత్రి కోరారు.
ఈ ప్రెస్ మీట్ లో ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులు, తదితరులు హాజరయ్యారు.