స్నేహానికి మిన్న ఈ లోకాన లేదు లే!
అయితే సిద్ధాంతం వేరు ఆచరణ వేరు స్నేహం గొప్పదే కావచ్చు! స్నేహం మాటను జరిగే మోసాలను అరికట్టడం అంతర్జాతీయ స్నేహితుల దినం వేళ అంకితం కావలసిన అవసరం ఉంది.*
***********
--- వడ్డేపల్లి మల్లేశం 9014206412
---02...08....2025**----
స్నేహితుల దినాన్ని ప్రతి ఏటా ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకోవడం రివాజు గా మారినప్పటికీ మొక్కుబడిగా నిర్వహించుకోవడమే ఇక్కడ నచ్చని అంశం. సిద్ధాంతం వేరు ఆచరణ వేరు అనేక సిద్ధాంతాలు ఆచరణకు వచ్చేవరకు అమలు కాని కారణంగా రద్దవుతున్నటువంటి సందర్భంలో మానవ సంబంధాలకు ఉత్కృష్టమైన స్థానాన్ని ఇచ్చినటువంటి" స్నేహం" అనే పదానికి సార్థకత చేకూర్చవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది. .కష్టాలు, కన్నీళ్లు, కడగండ్లు, పేదరికం, అవమానాలు, ఆవేదన, ఇబ్బందుల సమయంలో కూడా ఆత్మస్థైర్యాన్ని పెంచి తోటి మనిషిని సాటి మనిషిగా చూసే దివ్యమైనటువంటి ఔషధమే స్నేహం. ఔషధాన్ని వాడే క్రమంలో అతిగా వినియోగించిన, నిబంధనలు అతిక్రమించిన, శరీరం సహకరించకపోయినా ఏ రకంగా దుష్ప్రభావాలు ఉంటాయో స్నేహాన్ని కూడా మనస్ఫూర్తిగా అంగీకరించినప్పుడు మాత్రమే దాని ఫలితాలను పొందగలం.
"పేదవాడి నుండి పెద్దవాడి వరకు, రాజు నుండి బి కారి వరకు, మేధావి నుండి సామాన్యుడి వరకు వాళ్ల వాళ్ల స్థాయిలలో స్నేహం అంతర్భాగంగా కొనసాగుతూ ఉంటుంది. చదువు, పట్టాలు, ఉద్యోగాలు,హోదాతో సంబంధం లేనిది స్నేహం అని నిర్వచించుకుంటే మానవ సంబంధాలను ఉత్కృష్టమైన స్థాయికి తీసుకు వెళ్లగలిగినటువంటి ఒక వేదిక ఒక స్థాయిగా స్నేహాన్ని మనం నిర్ధారించుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. " ప్రతి సంవత్సరం ఒకరోజు స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా అప్పుడప్పుడు స్నేహితుల దినం రోజుననే స్నేహితులలో కొంతమంది మోసగాళ్లు తమ స్నేహితులని హత్య చేసి కలహాలు కన్నీళ్ళతో కుటుంబాలను వేదనకు గురి చేసిన సందర్భాలను మనం గమనిస్తే అది నిజమైన స్నేహం అ నబడుతుందా? తాగిన మైకంలో, మత్తు పదార్థాలు తీ సుకున్న నేపథ్యంలో ఆర్థిక పరమైనటువంటి స్వార్థ ప్రయోజనాల సందర్భంలో మనుషులు తమ మధ్యన ఉన్నటువంటి స్నేహాన్ని వదిలిపెడుతున్నారు. స్వార్థానికి ఒడి గట్టి అవసరమైతే హత్యలు చేయడానికి కుటుంబాలను కొల్లగొట్టడానికి ఇతరులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ ఆధునిక కాలంలో స్నేహాన్ని పునర్ నిర్వచించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా మన ప్రవర్తనలో కూడా మార్పులను చేర్చుకోవడం చాలా అవసరం.
స్నేహాన్ని ఎలాచూ డాలి, మన కర్తవ్యం:-
************
నైతిక మద్దతు ఇవ్వడం, ఆర్థికంగా సహకరించడం, భరోసా కల్పించడం, నేనున్నా నీకంటూ ఆత్మవిశ్వాసాన్ని పెంచడం వంటి అంశాలు నిజమైనటువంటి స్నేహానికి గుర్తుగా భావించాలి. అక్కడ వ్యక్తుల మధ్యన స్థాయి భేదాలు అవసరం లేదు పైగా అవసర కాలములో ఆదుకున్నదే నిజమైన స్నేహమని, మాట వరసకు మొక్కుబడిగా స్నేహితులని చెప్పుకోవడంతోనే సరి పెట్టుకుంటే దానికి అర్థం లేదని, ప్రయోజనంతో కూడుకున్నటువంటి పవిత్రమైనటువంటి బలమైన రసాయనిక బంధం కలిగినటువంటి నిజమైన స్నేహం అని రుజువు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. మోసాలు, ద్వేషాలు, అసూయ, స్వార్థం, కుట్రలు కుతంత్రాలు నిత్య కృత్యమైన ఈ కాలములో వీటన్నింటినీ చేదించగలిగినటువంటి స్థాయిలో మన ప్రవర్తనను తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడేది స్నేహం అనే పవిత్రమైనటువంటి పదం. అది మానవ జీవితంలో అంతర్భాగంగా ఉండాల్సినటువంటి లక్షణం కావాలి. కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అనేక ఇబ్బందులు, బాధలు, ప్రమాదాలు, అపాయాలు, కన్నీరు పెట్టించే దృశ్యాలను చూసి చలించకపోతే మనం నిజమైన మనుషులం ఎలా అవుతాం? ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులకు జరిగినటువంటి బాధను చూసి తట్టుకోలేని పరిస్థితిలో ఒక్కొక్కసారి మనం గిలగిలా కొట్టుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు పవిత్ర బంధం కొన్నేళ్లుగా కొనసాగుతున్నటువంటి వ్యక్తుల మధ్యన ఉన్న బలమైనటువంటి స్నేహానికి పవిత్రత చేకూర్చడానికి మనం సిద్ధంగా ఉండకపోతే మన మనుషులం ఎలా అవుతాము? "అద్దాల మేడలు రంగుల గోడలు మాత్రమే అభివృద్ధి కాదు నైతిక అభివృద్ధి దేశాభివృద్ధి" అని మహాత్మా గాంధీ నైతిక విలువల పట్ల తన ఆసక్తిని వ్యక్తం చేసిన సందర్భంలో బాల్య దశ నుండే విద్యార్థులకు నైతిక విలువలను ఉగ్గుపాలతో రంగరించగలిగితే రాబోయే తరాలను మనం అనుకున్న స్థాయిలో స్నేహితులుగా, మిత్రులుగా, అభిమానులుగా, ఆత్మీయత కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది కదా! పాఠశాల స్థాయి నుండి స్నేహం ప్రారంభించబడాలి అది రోజు రోజుకు మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరిల్లి వర్ధిల్లి వ్యక్తుల మధ్యన పరివ్యాప్తం కావాలి. తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగే సంస్కారాన్ని పెంచగలిగితే నిజమైనటువంటి స్నేహాన్ని మనం అమలు చేసినట్లే! ఎందుకంటే వ్యాపారమయమై మానవ సంబంధాలన్నీ మార్క్స్ చెప్పినట్లుగా మానవ సంబంధాలన్ని ఆర్థిక సంబంధాలుగా కొనసాగుతున్నటువంటి ఈ కాలంలో ఆ భావనను చెరిపివేయాలంటే స్నేహాన్ని మరింత పటిష్ట పరచవలసిన అవసరం ఉంది. అందుకు ఇరుపక్షాలు, అన్ని వర్గాలు, మానవ సమాజం పునర్ అంకితం అయితే తప్ప సాధ్యం కాదు. త ప్పట డుగులు వేయడం వేరు కావాలని తప్పులు చేయడం వేరు ఈ రెంటి మధ్యన గల తేడాను అర్థం చేసుకోగలిగితే పొరపాట్లను సవరించుకోవడానికి, స్నేహాన్ని మరింత ఇనుమడింప చేయడానికి, బంధాలను పవిత్రంగా ఉంచుకోవడానికి,
కష్ట కాలంలో తోడున్నారని సమాజం పట్ల విశ్వాసాన్ని పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
" స్నేహం అనేది జీవితంలో నిరంతరం ఆచరణాత్మకమైన అంతర్భాగంగా కొనసాగాలి కానీ దానిని ప్రత్యేకంగా పనిగట్టుకుని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే దాని సహజత్వం కోల్పోతుంది. పచ్చని చెట్లు ప్రగతికి ఏ రకంగా మెట్టు అవుతుందో నిజమైనటువంటి స్నేహం కూడా బలమైన సమాజ నిర్మాణానికి అంతకంటే మిన్నగా తోడ్పడుతుంది అనడంలో సందేహం లేదు. వ్యక్తిగతంగానూ సామూహికంగానూ దేశాభివృద్ధిలోనూ కీలకపాత్ర పోషిస్తున్న స్నేహం మానవ సంబంధాలకు ఒక దిక్సూచిగా నిరంతరం కొనసాగాల్సిందే. స్నేహాన్ని కాపాడుకోవడం, జీవనది లాగా నిత్యం ప్రవహించే లాగా మన కృషిని కొనసాగించడమే మన ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం కావాలి. "
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )