భూ సమస్యల సత్వర పరిష్కారానికై రెవెన్యూ సదస్సులు.....అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ
జోగులాంబ గద్వాల 8 మే 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ అన్నారు.
భూ భారతీ పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులో భాగంగా గురువారం ఇటిక్యాల మండలంలోని సతర్ల గ్రామంలో నిర్వహించిన సదస్సులలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. సదస్సులతో భేటీ అయ్యి, వారి అర్జీలను స్వీకరిచి, సమస్యలను అడిగి తెలుసుకుని సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ భూభారతి విధివిధానాల గురించి,చట్టంలో పొందుపర్చిన అంశాలపై అవగాహన కల్పించారు.ధరణి చట్టం వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేలా సమగ్ర అంశాలను పొందుపరుస్తూ భూభారతి చట్టం తెచ్చిందని తెలిపారు. మేధావులు, అధికారులు అధ్యయనం చేసి, డా.బి.ఆర్ అంబేద్కర్ జయంతి రోజున ప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రారంభించిందని తెలిపారు.చట్టం రూపొందించే సమయంలో రైతుల సంక్షేమం కోసం వారి సమస్యలను ప్రస్తావించి, అభిప్రాయాలను చట్టంలో ప్రతిబింబించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. రెవెన్యూ అధికారులతో కూడిన బృందాలు అందుబాటులో ఉంటూ భూ సంబంధిత సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు.ఈ సదస్సుల్లో మాత్రం రైతులు ఎటువంటి ఫీజు లేకుండా తమ హక్కుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన మీదట నిర్ణీత గడువులోపు సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ సూచించారు.ప్రస్తుతం పైలెట్ ప్రాతిపదికన ఇటిక్యాల మండలంలో కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులు ముగిశాక, జిల్లాలోని మిగితా మండలాల్లో గల అన్ని రెవెన్యూ గ్రామాలలో భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతుందన్నారు. రైతులు, ప్రజలు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ సదస్సులలో ఆర్డీఓ శ్రీనివాస రావు,ఇటిక్యాల తహసీల్దార్ వీర భద్రప్ప, ఎర్రవల్లి తహసీల్దార్ నరేష్,రెవెన్యూ సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు.