బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కన్వీనర్ ఆరుట్ల జానకిరాంరెడ్డి అక్రమ అరెస్ట్ దుర్మార్గం
మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు తీవ్ర ఆగ్రహం
సూర్యాపేట జిల్లా ప్రయోజనాల కోసం పోరాడుతుంటే అరెస్ట్ చేస్తారా?
తక్షణమే జానకిరాంరెడ్డి ని బేషరతుగా విడుదల చేయాలి: బీజేపీ రాష్ట్ర నాయకులు సంకినేని వెంకటేశ్వరరావు డిమాండ్.
సూర్యాపేట: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నకిరేకల్ పర్యటనను పురస్కరించుకొని, సూర్యాపేట జిల్లా కేంద్రంలో దాదాపు గత 45 రోజులుగా శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న బుల్లెట్ ట్రైన్ సాధన సమితి" కన్వీనర్ ఆరుట్ల జానకిరాంరెడ్డి ని పోలీసులు అక్రమంగా ముందస్తు అరెస్ట్ చేయడాన్ని భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర నాయకులు, మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా సంకినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... శంషాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ను సూర్యాపేట స్టేషన్ మీదుగానే కొనసాగించాలనేది సూర్యాపేట జిల్లా ప్రజల, యువత యొక్క సుదీర్ఘమైన, న్యాయమైన డిమాండ్ అని పేర్కొన్నారు. జిల్లా భవిష్యత్తు కోసం, రాబోయే తరాల అభివృద్ధి కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తున్న ఉద్యమకారులను అర్ధరాత్రి, ముందస్తు అరెస్టుల పేరుతో వేధించడం అప్రజాస్వామికమని మండిపడ్డారు.
అదేవిధంగా, శంషాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ను సూర్యాపేట స్టేషన్ మీదుగానే కొనసాగించాలనేది సూర్యాపేట జిల్లా ప్రజల, యువత యొక్క సుదీర్ఘమైన, న్యాయమైన డిమాండ్ అని పేర్కొన్నారు. అయితే, "రాష్ట్ర ప్రభుత్వం మరియు కొందరు అధికార పార్టీ పెద్దలు తమ అనుచరుల వ్యక్తిగత లాభాల కొరకు, రియల్ ఎస్టేట్ మాఫియా ప్రయోజనాల కోసమే ఈ రూట్ అలైన్మెంట్ను మార్చాలని కుట్రలు పన్నుతున్నారు. జిల్లా ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి, కొంతమంది స్వార్థ లాభాల కోసం అలైన్మెంట్ మార్చాలని చూస్తే చూస్తూ ఊరుకోం" అని సంకినేని వెంకటేశ్వరరావు తీవ్ర ఆరోపణలు చేశారు.
సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ స్టేషన్ ఏర్పాటు అనేది ఈ ప్రాంత పారిశ్రామిక, ఆర్థిక వృద్ధికి ఎంతో కీలకమని, ఈ న్యాయమైన పోరాటానికి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు వెంటనే అక్రమంగా అరెస్ట్ చేసిన ఆరుట్ల జానకిరాంరెడ్డి ని బేషరతుగా విడుదల చేయాలని సంకినేని వెంకటేశ్వరరావు గారు డిమాండ్ చేశారు...