పంట వ్యర్థాలను కాల్చితే చట్టపరమైన చర్యలు: ఎస్పీ నర్సింహ
పంట పొలాల్లో వరి కొయ్యలు, వ్యర్థాలకు నిప్పు పెట్టడం వల్ల భూసారం తగ్గడమే కాకుండా, విద్యుత్ మోటార్లు, గడ్డివాములు తగలబడి రైతులకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతుందని ఎస్పీ నర్సింహ హెచ్చరించారు. ఈరోజు ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వడగాల్పుల వల్ల మంటలు వేగంగా వ్యాపించి ప్రమాదాలకు దారితీస్తున్నాయని అన్నారు. వ్యర్థాలను కాల్చకుండా భూమిలో కలియదున్ని సేంద్రియ ఎరువుగా వాడుకోవాలని చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ చెప్పారు.