ఓటు హక్కు ద్వారా ప్రతి మనిషికి ఒకే విలువ సరే సమాన పనికి సమాన వేతనం లేదేమి
ఓటు హక్కు ద్వారా ప్రతి మనిషికి ఒకే విలువ సరే సమాన పనికి సమాన వేతనం లేదేమి? రాసుకున్న రాజ్యాంగం వేరు అమలవుతున్న ఆర్థిక దోపిడీ మరో తీరు నిర్బంధం అణచివేత వనరుల కేంద్రీకరణ ఇదంతా మానవహక్కుల విధ్వంసం కాదా ?
వడ్డేపల్లి మల్లేశం
13...12...2024
భారతదేశంలో ఓటు హక్కును కల్పిస్తూ రాజ్యాంగ రచన సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరికీ ఒకే ఓటు హక్కును కల్పించడం ద్వారా సమానత్వాన్ని సాధించే ప్రయత్నం జరిగినట్లు దీనిని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని యజమానులుగా ప్రభువులు గా మారాలని ఆదమరచి ఉంటే సేవకులుగా బానిసలుగా బ్రతకాల్సి వస్తుందని, మానవ హక్కుల విధ్వంసం, ప్రమాదం ముంచుకొస్తుందని హెచ్చరించడo నేడు భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా కూడా కొనసాగడం ఆందోళన కలిగించే విషయం. ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరుల పైన ప్రజలందరికీ హక్కు ఉండాలి అడవి పైన ఆదివాసులకు ఆయా ప్రాంతాలలో ఉన్న వనరుల పైన ప్రత్యేక వర్గాలకు హక్కు సహజమైనది. కానీ పెట్టుబడి దారి బహుళ జాతి సంస్థలు ఆ వనరులను కొల్లగొట్టి సహజమైన అధికారమున్న వాళ్లకు అందకుండా చేస్తున్న ద మన నీతిని ఎండ కట్టకపోతే మానవ హక్కుల ఉల్లంఘన నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఆలోచించడం వేరు ప్రశ్నించి ప్రతిఘటించి వీలైన అన్ని మార్గాల ద్వారా హక్కులను సాధించుకోవడం వేరు. స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ భారతదేశంలో అస్వతంత్రంగా వ్యవహరిస్తు పాలకవర్గాల ఆధిపత్యానికి గురవుతున్న సందర్భంలో రాజ్యాంగ ప్రవేశికలో రాసుకున్న "న్యాయం" కూడా మేడిపండు చందమే అయ్యింది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా రాజ్యాంగాన్ని పక్కనపెట్టి తమ వ్యక్తిగత ఎజెండాను అమలు చేస్తున్న సందర్భంలో అనేక వర్గాలు ప్రశ్నించి ప్రతిఘటించి రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని తమ హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేసినా రైతులు కార్మికులు, చేతివృత్తుల వాళ్ళు విభిన్న వర్గాల వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను అన్యాక్రాంతం కాకుండా ప్రైవేటుపరం చేయకుండా చూడాలని పోరు బాట పట్టినా ఈ దేశంలోని ఓడరేవులు, రైల్వే స్టేషన్లు, ఖనిజ వనరులు, జీవిత బీమా వంటి అత్యంత విలువైన ఇన్సూరెన్స్ సంస్థలు కూడా ప్రైవేటు పరం కావడం క్ర మంగా మానవ హక్కులను కోల్పోయి బానిస మనస్తత్వంలోకి జారుకోవడమే. విప్లవరకచ యితల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, మానవ హక్కుల వేదిక, రాష్ట్ర కేంద్రాలలో ప్రభుత్వ సంస్థలైన మానవ హక్కుల కమిషన్లు, మహిళా కమిషన్లు కొనసాగుతున్నప్పటికీ అవన్నీ కూడా చివరికి ప్రభుత్వo చేతిలోనే జేబు సంస్థలు గా మారడం... ఇదే తీరును చూస్తూ అన్యాపదేశంగా సమైక్య ఉద్యమాలకు దూరంగా జీవించడం అంటే మన హక్కులను మనం కావాలని పెత్తందారీ వర్గాలకు బదిలీ చేయడమే అవుతుంది. పేదరిక నిర్మూలనకు, ఉపాధి హామీకి,ఉద్యోగాల కల్పనకు, మానవాభివృద్ధిని సాధించే క్రమంలో సామాన్య వర్గాల ఆదాయాన్ని పెంచే ప్రక్రియలు చర్యలు ఏమాత్రం చేపట్టకపోవడం కూడా ప్రజలను నిర్వీర్యపరచడమే, నిర్జీవులుగా మార్చడమే, మరోరకంగా జీవించే హక్కును కాలరాయడమే అవుతుంది.అధికారం పైన కాంక్ష, ఆశయాలు ఆకాంక్షలు శాస్త్రీయ పద్ధతిలో లక్ష్యాన్ని సాదుకోవడానికి తగిన పోరాటాలు కనీస స్థాయిలో కూడా జరగడం లేదు. ఎక్కడికక్కడ ప్రశ్నించడం , చైతన్యాన్ని భారీగా పెంపొందించుకుని హెచ్చరించడం కూడా చాలా అవసరం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో ప్రశ్నించే కాంగ్రెస్ వంటి ప్రతిపక్షాలలో అర్బన్ నక్సలైట్ల పేరుతో అనేకమంది కొనసాగుతున్నారంటూ విమర్శించిన తీరు విద్యావంతులు మేధావులు బుద్ధి జీవులు మానవ హక్కుల కార్యకర్తలు చేస్తున్న ఉద్యమాలలో పాల్గొంటున్న వారిని కూడా అర్బన్ నక్సలైట్లు సంఘవిద్రోహ శక్తులు అనే పేరుతో శిక్షించడానికి ప్రయత్నిస్తున్న తీరు స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని, భావ ప్రకటన హక్కును అడ్డుకోవడమే. గత రెండు సంవత్సరాలుగా ఉక్రెయిన్ పై రష్యా దాడులకు పాల్పడుతూ సహజ వనరులను కొల్లగొడుతూ అంతర్జాతీయ మార్కెట్లో అసమతుల్యతను సృష్టించిన తీరు ఆయుధాలను భారీగా వినియోగించి ఉనికి కోసం ప్రయత్నిస్తే ప్రశ్నిస్తే ఇదే గతి అని ఇతర దేశాలకు కూడా హెచ్చరించిన తీరు ఆందోళన కలిగించే అంశం. ఇక పా లస్తీనా పైన ఇజ్రాయిల్ దాడులు ఆ దాడులకు అమెరికా యుద్ధ దాహం తోడై సహకరిస్తున్న తీరు అంతర్జాతీయ స్థాయి ప్రచ్చ న్న యుద్ధ వాతావరణన్ని ఒకవైపు తలపిస్తుంటే భారతదేశంలో అంతర్గతంగా మణిపూర్ అల్లర్లు ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి ఉద్యమకారులను ఎన్కౌంటర్ల పేరుతో హత్య చేయడం వంటివన్నీ కూడా స్వతంత్ర భారత్లో జరగాల్సినవేనా? ఒక వ్యక్తిని చంపే అధికారం పాలకులకు ఇతరులకు ఎక్కడిది? "అభిప్రాయాలు, ఆలోచనలు, భావవ్యక్తీకరణ, సమ సమాజ స్థాపన, సమానత్వం, అంతరాలు లేని వ్యవస్థ పైన స్పష్టమైన అభిప్రాయాలు కలిగి ఉంటే తప్పేమీ కాదు అని సర్వోన్నత న్యాయస్థానం అనేక సందర్భాలలో చెప్పినప్పటికీ అసమానతలకు దోపిడికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి హక్కుల కార్యకర్తలు ఉద్యమకారులను అంతం చేయడం పైన పాలకులు దృష్టి సారిస్తున్నారంటే ఈ దేశంలో ఏది చేసినా తలవంచి బ్రతికే అమాయక సమాజాన్ని మాత్రమే కొనసాగించాలని పాలకుల ఉద్దేశమా? ఒక అంచనా ప్రకారం గా ఇజ్రాయిల్ జాతి దూరహంకార చర్యలలో భాగంగా గాజాను నేలమట్టం చేసి పిల్లలు పెద్దలతో సహా 43 వేల మందిని బలి తీసుకున్నట్లుగా తెలుస్తున్నప్పటికీ ఆ సంఖ్య లక్షల్లోనే ఉండి ఉంటుందని అంతర్జాతీయ సమావేశం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. విద్య, వైద్యం, సామాజిక న్యాయం వంటి అంశాలను పేద వర్గాలకు అందకుండా చేయడం ప్రైవేట్ రంగంలో వీటి కోసం ప్రజలు తమ సంపాదనలో 70 శాతం ఖర్చు చేయవలసి రావడంతో పేద వర్గాల కొనుగోలు శక్తి మరింత పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారంటే వారు మనుషులుగా బతకాలంటే ఎంత కష్టం? ఎంత దౌర్భాగ్యం? ఎంత దయనియస్థితి? దీనికి అంతం లేదా? కుల గణన ద్వారా సమాజంలోని భిన్న వర్గాలకు వారి వారి దామాషాలో అవకాశాలను కల్పించడానికి ప్రయత్నం చేయవచ్చునని బీసీ సంఘాలు ప్రజా సంఘాలు మేధావులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంటే కులతత్వం పెరిగిపోతుంది అని ఒకే ఒక సాకుతో ఈ దేశంలో కుల గణనను చేయడానికి ప్రభుత్వం సుప్రీంకోర్టు హెచ్చరించినా కూడా వినడం లేదంటే ఎంత ఆధిపత్య ధోరణి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆచరణలో చూసినప్పుడు ఆధిపత్య వర్గాలే కిందిస్థాయి పోస్టు నుండి ప్రధానమంత్రి వరకు కొనసాగుతున్న సందర్భంలో ఉద్యోగ వర్గాలలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల శాతం అత్యంత దయనీయస్థితిలో ఉండడాన్ని మనం గమనిస్తే ఇది చాప కింద నీరు లాగా ఈ దేశంలో పెట్టుబడిదారీ వర్గం తమ అధికారాన్ని శాశ్వతం చేసుకోవడానికి జరుగుతున్న కుట్రగా మనం భావించాలి. బీసీ వర్గాల దామాషాలో 56శాతం ఇవ్వడానికి మనసు రాని కేంద్రం E W S పేరుతో అగ్రవర్ణ పేదలకు 10% ఇవ్వడమంటే రాజ్యాంగ ఉల్లాంఘానే. ఆ వర్గాలే 5%వున్నప్పుడు అందులో పేదలకని 10%ఇవ్వడం హే్యమైన చర్య. ఇటీవల అధికార మార్పిడి జరిగిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో సహా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ ఉచితాలు తాయిలాలు వాగ్దానాలు ప్రలోభాలతో మాత్రమే ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి కానీ ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణమైన పరిపాలన చేయడం లేదు అనేది సుస్పష్టం. భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వ భూములు భూస్వాముల మిగులు భూములను పంచిన దాఖల ఎక్కడైనా ఉందా? 40 శాతం సంపద ఒక్క శాతం సంపన్న వర్గాల చేతిలో బందీ అయి ఉంటే కూడా అందుకు ఆదేశిక సూత్రాలు అనుమతించకపోయినా 77 ఏళ్ల పరిపాలనలో ఈ దేశంలో ఈ అసమానతలు కొనసాగుతున్నాయి అంటే ఇది అనుకోకుండా జరిగిన పని కాదు ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వాలు ఒక వర్గానికి దోచిపెట్టే ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగించడమే. సంపన్న వర్గాలైన పెట్టుబడిదారులు ప్రభుత్వం దగ్గర తీసుకున్నటువంటి బ్యాంకు రుణాలను కేంద్ర ప్రభుత్వం సుమారు 16 లక్షల కోట్ల రూపాయలను మాఫీ చేసిన విషయం మరి ఎంతోమంది ఎగవేతకు పాల్పడుతున్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకుంటే పిడికెడు మెతుకుల కోసం,మనిషి ఉనికి కోసం, అస్తిత్వం కోసం అడిగి ప్రశ్నించినటువంటి సామాన్య పేద ప్రజలను ఎంత హింసిస్తున్నారు ఎన్ని కాల్చివేతలకు గురి చేస్తున్నారు అర్థం చేసుకున్నప్పుడు ఈ వివక్షతను ఖండించవలసిన అవసరం లేదా?. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించుకోవడం ద్వారా అనచివేత అసమానతలు, వివక్షత దోపిడీకి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటాలను అణచివేసే ధోరణి పాలకవర్గాలు ఇకనైనా మానుకోవాలని ఆ స్థాయిలో ప్రజా పోరాటాలు నిర్మించుకోవాలని ఉద్యమ ప్రజా సంస్థలు నిర్ణయం తీసుకోవడమే కాదు ప్రజలకు వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రజల ఆకాంక్షలను అక్షర రూపంలోకి తీసుకురావడానికి రాజ్యాంగంలోని విలువల పరిరక్షణకు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే విధంగా ప్రజలందరూ కూడా నిజమైన భాగస్వాములు అయ్యే క్రమంలో అవసరమైన పక్షంలో పోరాటాలకు కూడా సిద్ధం కావడమే నిజమైనటువంటి మానవ హక్కులను కాపాడుకోవడం. అందుకు సాగుతున్న పోరాటాలను మద్దతు పలకడం మనందరి బాధ్యతగా భావించాలి ఆ వైపుగా కృషి చేస్తున్నటువంటి సంస్థలను కాపాడుకోవడం కూడా మనందరి సామాజిక బాధ్యత.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)
(మానవహక్కులవేదిక 10వ రాష్ట్రముహాసభలు అనంతపూర్ లో 14,15తేదీలలో జరుగుతున్న సందర్భంగా వ్యాసం )