ఆదర్శ విద్యా మందిరంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి
శిక్షణ కేంద్రం పేరుతో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి: మండల విద్యాధికారికి వినతిపత్రం అందజేత.
నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ డిమాండ్.
జోగులాంబ గద్వాల 4ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- అయిజ. మండల కేంద్రంలోని ఆదర్శ విద్యా మందిరం పాఠశాల యాజమాన్యంపై విచారణ జరిపి తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు మండల విద్యాధికారి రాములుకు పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు హరీష్ నేతృత్వంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ ఆదర్శ విద్యా మందిరం పాఠశాల పేరుతో ప్రత్యేక కోచింగ్ సెంటర్ నిర్వహిస్తూ విద్యార్థులపై తీవ్ర మానసిక ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించారు. మార్కులు, ఉత్తీర్ణత ఫలితాల పేరుతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతుండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల సంక్షేమం, భద్రత మరియు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత విద్యాసంస్థలపై ఉందన్నారు. ఈ పాఠశాలలో అమలవుతున్న నిబంధనల విరుద్ధ శిక్షణ విధానాలు, విద్యార్థులపై పడుతున్న ఒత్తిడి, వసతులు మరియు నిర్వహణపై విద్యాశాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. ఇందులో లోపాలు తేలితే బాధ్యులైన యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు.