వంద రోజుల్లో ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్ ఆత్మహత్య .

Oct 14, 2024 - 16:46
 0  1
వంద రోజుల్లో ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్ ఆత్మహత్య .

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పోలీసుల ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్నాయి.

వంద రోజుల్లో జిల్లాలో ఓ ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒక్కొక్కరు ఒక్కో రకం కారణాలతో ఆత్మహత్య చేసుకోవడంతో జిల్లాలో పోలీసులకేమైందనే చర్చ మొదలైంది.

ఇదీ పరిస్థితి.జిల్లాలోని అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న శ్రీరాములు శ్రీనివాస్ జూన్ 30న ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. వారం రోజుల తర్వాత చనిపోయాడు. పై అధికారులతో పాటు కింది స్థాయి సిబ్బంది తనను కించపర్చే విధంగా వ్యవహరిస్తున్నారని, ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆత్మహత్యకు పాల్పడ్డ శ్రీనివాస్ పెట్టిన సెల్ఫీ వీడియో అప్పుడు రాష్ట్ర స్థాయిలో కిందట పోలీస్ శాఖలో కలకలం రేపింది. 

ఎస్సై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్లోనే పనిచేస్తున్న కొందరు సిబ్బందితో పాటు ఇంటిలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్లు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. సరిహద్దు పోలీస్ స్టేషన్ కావడం, స్టేషన్లో కొందరు సిబ్బంది చెప్పిందే వేదంగా మారడంతో ఆఫీసర్లు, సిబ్బంది మధ్య మిస్ అండర్ స్టాండింగ్ నెలకొంది. ఈ క్రమంలో సిబ్బంది తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఎస్సై సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. 

ఎస్సై శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్య నుంచి జిల్లా పోలీసులు తేరుకోక ముందే క్లూస్ టీంలో పనిచేస్తున్న రమణారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. పాల్వంచలో నివాసం ఉంటూ క్లూస్ టీంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ రమణారెడ్డి సెప్టెంబర్లో ఆత్మహత్య చేసుకున్నారు. తట్టుకోలేని కష్టాలు తనకే వస్తున్నాయి, కుటుంబ సమస్యలతో సతమత మవుతూ మానసిక ఒత్తిడితో గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టుగా ఆయన తన సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. 

తాజాగా బూర్గంపహడ్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న సాగర్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం జిల్లా పోలీస్ శాఖలో సంచలనం సృష్టించింది. పోలీస్ స్టేషన్లో గంజాయి మాయమైన కేసులో తనను పోలీస్ ఆఫీసర్లు అక్రమంగా ఇరికించారని, ఎస్సైలు సంతోష్, రాజ్కుమార్ ఇందుకు బాధ్యులని, అన్యాయంగా తనను ఇబ్బందులు పెట్టారని సెల్ఫీ వీడియోలో ఆరోపించిన సాగర్ పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. 

 కౌన్సిలింగ్ అవసరం.. 

వరుస ఆత్మహత్యల నేపథ్యంలో పోలీసులకు వ్యక్తిత్వ వికాస నిపుణులచే అవగాహన సదస్సులు పెట్టించాల్సిన అవసరం ఉందనే వాదన పోలీస్ శాఖలో వినిపిస్తోంది. పని ఒత్తిడి, ఆఫీసర్లు, సిబ్బంది మధ్య కో ఆర్డినేషన్, ఆర్థిక ఇబ్బందులు, పర్యవేక్షణపై పర్సనాలిటీ డెవలప్మెంట్పై పలు సూచనలు ఇవాల్సి ఉంది. 

 ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావు 

ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని ఎస్పీ బి. రోహిత్ రాజు పేర్కొన్నారు. సమస్యలేమైనా ఉంటే తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు. పోలీస్ ఆఫీసర్లతో పాటు సిబ్బంది ఎప్పుడైనా తన వద్దకు వచ్చి సమస్యలను చెప్పుకునే అవకాశం కల్పించానని చెప్పారు. బూర్గంపహడ్ కానిస్టేబుల్ సాగర్ను వారి కుటుంబ సభ్యులు, ఆయన విజ్ఞప్తి మేరకు మానవతా దృక్పథంతో ఈ నెల 8న సస్పెన్షన్ ఎత్తివేశామని, పోస్టింగ్ కూడా ఇచ్చామని, ఇంకా ఏమైనా ఇబ్బంది ఉంటే తన దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కారం అయ్యేదని పేర్కొన్నారు. తొందర పాటుతో ప్రాణం పోగొట్టుకోవడం బాధగా ఉందన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333