యాతాలకుంట టన్నెల్ పనులను పరిశీలించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు
ఆగస్టు నాటికి టన్నెల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. గురువారం సత్తుపల్లి మండలం యాతాలకుంట వద్ద కొనసాగుతున్న టన్నెల్ నిర్మాణ పనులను సంయుక్తంగా పరిశీలించారు. టన్నెల్ నిర్మాణ పనుల పురోగతి, నాణ్యత, భద్రతా ప్రమాణాల అమలు, నిర్మాణ ప్రక్రియ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా పనుల స్థలాన్ని సందర్శించిన కలెక్టర్లు టన్నెల్ నిర్మాణ పనుల ప్రస్తుత స్థితిగతులను పరిశీలించి, చేపడుతున్న పనులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం పూర్తయిన పనులు, మిగిలిన పనులు, నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలు, పనుల వేగం, ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ పనులను మరింత వేగవంతం చేసి ఆగస్టు లోపల పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడరాదని, నిర్దేశిత సాంకేతిక ప్రమాణాలు, ఇంజినీరింగ్ నిబంధనలను పూర్తిస్థాయిలో పాటించాలని సూచించారు.
టన్నెల్ నిర్మాణ సమయంలో నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పనుల ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడరాదని, నిర్దేశిత సాంకేతిక ప్రమాణాలు, ఇంజినీరింగ్ నిబంధనలను పూర్తిస్థాయిలో పాటించాలని సూచించారు.
ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ పనుల అమలులో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తలెత్తే సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.
టన్నెల్ నిర్మాణానికి సంబంధించిన భద్రతా చర్యలు, మార్జిన్ సేఫ్టీ అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని, నిర్మాణ నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కలెక్టర్లు ఆదేశించారు. ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరే విధంగా నాణ్యమైన నిర్మాణాన్ని అందించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఈ పరిశీలనలో ఇరిగేషన్ శాఖ టన్నెల్ అండ్ సేఫ్టీ కార్యదర్శి కల్నల్ పరిక్షిత్ మెహ్రా, చీఫ్ ఇంజనీర్ ఎస్. శ్రీనివాస్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. కృష్ణ, సంబంధిత శాఖల అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.