వత్తిళ్లకు తలొగ్గొద్దు
నిబద్ధత కలిగిన జర్నలిజం అవసరం.
*పరిశోధనాత్మక
కథనాలకు చోటివ్వాలి.*
అక్షిత చీఫ్ ఎడిటర్ ఎం.దాస్.
* జోగులాంబ గద్వాల 5 ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల. ఉన్నది ఉన్నట్టుగా.. వత్తిళ్లకు తలొగ్గకుండా నిబద్ధత కలిగిన జర్నలిస్టులుగా అక్షర యజ్ఞం సాగించాలని అక్షిత తెలుగు జాతీయ దిన పత్రిక చీఫ్ ఎడిటర్ యం.దాస్ అభిప్రాయపడ్డారు.
ప్రతి అక్షరం సమాజ హితాన్ని కాంక్షించేలా ఉండాలన్నారు. బుధవారం మహబూబ్ నగర్ లోని రెడ్ క్రాస్ భవనంలో అక్షిత ఉమ్మడి మహబూబ్ నగర్ జర్నలిస్టుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్పిత, కట్టు కథలకు తావివ్వకుండా వాస్తవికతకు దర్పణం పట్టాలన్నారు. పరిశోధనాత్మక, మానవీయ కోణంలోని కథనాలకు చోటివ్వాలన్నారు. మీడియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలకు అనుగుణంగా జర్నలిస్టులు సాంకేతికతను పుణికి పుచ్చుకోవాలన్నారు.
సమాజంలో జరిగే సంఘటనలను నిజాయితీగా, నిష్పాక్షికంగా ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమైందన్నారు. ప్రజల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లడం, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం, అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకురావడం వంటి బాధ్యతలను జర్నలిస్టులు నిర్వర్తించాలన్నారు.
జర్నలిస్టు కేవలం వార్తలు రాసే వ్యక్తి మాత్రమే కాదు; సమాజానికి దిశానిర్దేశం చేసే మార్గదర్శి అన్నారు. నిజం కోసం అనేక సవాళ్లను, ఒత్తిళ్లను ఎదుర్కొంటూ ప్రజల తరఫున ప్రశ్నించే వారే జర్నలిస్టులుగా
మనగలుగుతారన్నారు.
ఈ డిజిటల్ యుగంలో సమాచారం క్షణాల్లో వ్యాపిస్తోందని, అలాంటి సమయంలో వాస్తవాలను నిర్ధారించి, ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించడం మరింత బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
అందుకే ప్రతి జర్నలిస్టు నిజాయితీ, నైతిక విలువలు, బాధ్యతాయుతమైన వైఖరిని పాటించాలన్నారు.
జర్నలిస్టుల వల్లే సమాజంలో అనేక సమస్యలు వెలుగులోకి వచ్చి పరిష్కారం పొందుతున్నాయన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు, అక్రెడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డుల వంటి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో బ్యూరో చీఫ్ లు రామ్మోహన్, ధనుష్, శ్రీనివాసులు, హన్మంత్, జర్నలిస్టులు రాములు, సుదర్శన్, శేఖర్, శ్రీనివాసులు, మన్యంకొండ, ప్రశాంత్ రెడ్డి, ఎద్దుల దేవేందర్ రెడ్డి, కృష్ణయ్య, మల్లేష్, అంజి, సూర్యప్రకాష్, తిరుపాల్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.