దొంగ చేతికి తాళాలిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కరీంనగర్, సెప్టెంబర్ 03: కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై సీబీఐ వేయాలని తొలుత డిమాండ్ చేసింది తామేనని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. అయితే తమ డిమాండ్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండేళ్ల కాలయాపన చేశారని మండిపడ్డారు. బుధవారం కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా సీబీఐ విచారణ ఎలా చేస్తుందంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు. కమిషన్ రిపోర్ట్ బీఆర్ఎస్ చేతిలో పెట్టి.. సీబీఐతో విచారణా అని ఆయన వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఘోష్ కమిషన్ రిపోర్ట్ బీఆర్ఎస్కు ఇచ్చి.. దొంగ చేతికి సీఎం రేవంత్ రెడ్డి తాళాలు ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బిడ్డ కవిత చెప్పిందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గుర్తు చేశారు..