తెలంగాణ ఇన్ క్లూజివ్ లైవ్లీ హుడ్ ప్రోగ్రాంకు జిల్లా ఎంపిక
తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సమాఖ్య (SERP) అధ్వర్యంలో కార్యాచరణకు స్వీకారం
గట్టు మండలంలో 15 గ్రామాల ప్రజలకు మేలు.
నిరుపేదలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వ సహకారం.
వివరాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.
జోగులాంబ గద్వాల ఎనిమిది ఏప్రిల్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల కేంద్ర ప్రభుత్వ నీతి అయోగ్ ఆధ్వర్యంలో ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ నిర్వహించబడుతున్న గట్టు మండలంలో పేద ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో తెలంగాణ ఇన్ క్లూజివ్ లైవ్లీ హుడ్ ప్రోగ్రాం (TGILP) కు జోగులాంబ గద్వాల జిల్లా ఎంపికైనట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ లైవ్లీహుడ్ ఇంక్లూసివే ప్రోగ్రాము (TGILP) అనేది తెలంగాణ ప్రభుత్వం ద్వారా తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సమాఖ్య (SERP) అధ్వర్యంలో అమలు చేస్తున్న ఒక ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమం అని, దీని ప్రధాన లక్ష్యం పేద మరియు బలహీన వర్గాల కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించడం అని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలొ భాగంగా గట్టు మండలంలో అత్యంత వెనుకబడ్డ 15 గ్రామాలను ఎంపిక చేసి అక్కడ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లను నియమిస్తామన్నారు. ఈ సమన్వయకర్తలు ఆయా గ్రామాల్లో నిరుపేదలు ఎవరున్నారు, వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, తదితర విషయాలపై సర్వే చేస్తారన్నారు. ఆర్థికపరమైన సమస్యలు ఉంటే కూడా ఫైనాన్షియల్ ఇన్ క్లూజివ్ ద్వారా, ప్రభుత్వ పథకాల పరంగా అర్హత కలిగిన వారిని గుర్తించి ఆర్థికంగా చేయూతనివ్వడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. ఎంపిక చేసిన ఆయా గ్రామాల్లోని ప్రతి 25 కుటుంబాలకు ప్రత్యేకంగా ఒక కోఆర్డినేటర్ ను కూడా నియమించి వారికి రెండేళ్లపాటు జీతాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కోఆర్డినేటర్లు ఆయా కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడేందుకు విధులు నిర్వర్తిస్తారన్నారు. ఈ కార్యక్రమంను విజయవంతం చేసేందుకు మండల అధికారులను కూడా భాగస్వాములను చేసి ప్రణాళికతో ముందుకెళ్లనున్నట్లు చెప్పారు.
సమన్వయకర్తలుగా ఆయా గ్రామాల్లోని మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులు ఉంటారని లేదా కుటుంబ సభ్యురాలై ఉండాలని చెప్పారు. 22 నుంచి 40 ఏళ్ల మధ్యలో వయస్సు కలిగి ఉండాలని, కనీసం పదవ తరగతి ఉత్తీర్ణురాలై, గతంలో ఏవైనా ప్రభుత్వ శాఖల్లో రిసోర్స్ పర్సన్లు గా పనిచేసి, ప్రస్తుతం ఖాళీగా ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎంపికైన సమన్వయకర్తలు లబ్ధిదారులకు కేవలం సలహాలు మాత్రమే ఇవ్వడం కాక సంబంధిత అంశాలపై ప్రయోగపూర్వకంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. మైక్రో ఫైనాన్స్, సేవింగ్స్, క్రెడిట్ నిర్వహణ, తదితర అంశాలపై కూడా అవగాహన కలిగించాల్సి ఉందన్నారు. అలాగే సమన్వయకర్తలు తమకు కేటాయించిన ప్రాంతంలో ఉండే ఆయా కుటుంబాల ఇండ్ల సందర్శనలను రికార్డ్ చేయడం, సమావేశాలు, చర్చ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
తెలంగాణ ఇన్ క్లూజివ్ ప్రోగ్రాంలో భాగంగా ఐదు ఏళ్ల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించడమే కాక ఎంపిక చేసిన ఆయా కుటుంబాలకు ప్రతి ఏడాది ఆర్థికపరమైన ఎదుగుదలకు ఇన్సెంటివ్స్, లోన్స్ ను ఇవ్వడం జరుగుతుందన్నారు. పేద ప్రజల మౌలిక వసతులు, ఆర్థికపరమైన, సామాజిక అవసరాలు బాగుపడేందుకు ఈ కార్యక్రమం తో పాటు ప్రభుత్వ పథకాల పరంగా పూర్తిస్థాయిలో సహాయ, సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. ప్రస్తుత నూతన పథకంతో గట్టు మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉందని, పథకాన్ని సమర్ధవంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం తమ పూర్తి సహకారాన్ని అందిస్తుందని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.