తహసీల్దార్ దాడి ఘటనపై సంపత్ కుమార్ స్పందించాలి
దళిత ప్రజాప్రధినిధులు స్పందించకుంటే ఎవరు స్పందిస్తారు

బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఆకేపోగు రాంబాబు
జోగులాంబ గద్వాల 5 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఐజ కాంగ్రెస్ నాయకులు ఇటిక్యాల మండల తహసీల్దార్ నరేందర్ పై దాడి చేసిన ఘటన పై అలంపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి ఎస్ఎ సంపత్ కుమార్ స్పందించాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకేపోగు రాంబాబు డిమాండ్ చేశారు.మంగళవారం ఆయన ఐజ మండల కేంద్రంలో కార్యకర్తలతో కలిసి మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటిక్యాల తహసిల్దార్ పై ఘటన జరిగినేటికీ ఐదు రోజులైనా స్పందించకపోవడం బాధాకరమన్నారు. అలంపూర్ ఎస్సీ నియోజకవర్గంలో దళితులపై దాడులు జరిగినప్పుడు దళిత ప్రజాప్రతినిధులు స్పందించకుంటే మరెవరు స్పందిస్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ విఎమ్ అబ్రహం లు స్పందించాలన్నారు. స్పందించకపోతే దాడి వెనుక కాంగ్రెస్ కుట్ర ఉంటుందని ప్రజలు అనుకుంటారని సందర్భంగా ఆయన తెలిపారు.అదేవిధంగా ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజేయుడు కూడా స్పందించాలన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే నేటికీ స్పందించకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలలో ఇంటింటికి తిరిగి ఓట్లు వేయాలని ప్రజలను ప్రాదేయపడే ప్రజాప్రతినిధులు.. దళిత అధికారులు, దళితులపై దాడులు జరుగుతుంటే స్పందించకుండా ఉండడం దేనికి నిదర్శనమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. దాడులను ఖండించడం ప్రజాప్రతినిధుల బాధ్యత కాదా..? అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఎక్కడైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీలపై దాడులు జరిగితే స్పందించే బాధ్యత ప్రజాప్రతినిధులది కాదా..? అని అన్నారు.దళిత ప్రజా ప్రతినిధులు స్పందించకుంటే మరెవరు స్పందిస్తారని అన్నారు. ఇప్పటికైనా దాడి పై దళిత ప్రజాప్రతినిధులు స్పందించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట జిల్లా ఉపాధ్యక్షులు గద్దెపాగ మణి కుమార్, బీఎస్పీ సీనియర్ నాయకులు రాజారత్నం,శశి కుమార్ వర్మ, వావిలాల మోహన్ రాజు ఇతరులు పాల్గొన్నారు.