44 వేలకుపైగా అక్రిడిటేషన్ కార్డులు

Feb 12, 2026 - 22:08
 0  18
44 వేలకుపైగా అక్రిడిటేషన్ కార్డులు

44 వేలకుపైగా అక్రిడిటేషన్ కార్డులు

అర్హులందరికీ అక్రిడిటేషన్ అందిస్తాం

జి.ఓ. 103తో ప్రక్రియలో కీలక సవరణలు

ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాకు సమాన ప్రాధాన్యం

జిల్లా, మండల స్థాయి జర్నలిస్టులకు పెద్ద ఎత్తున అవకాశాలు

మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకూ అక్రిడిటేషన్ కార్డు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందన్నారు. అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ సిహెచ్. ప్రియాంక, ముఖ్యమంత్రి సీపీఆర్‌వో జి. మల్సూర్‌లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అక్రిడిటేషన్ కార్డుల జారీ విధానం, కమిటీ ఏర్పాటు, పారదర్శక ప్రక్రియ అమలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించి దిశానిర్దేశం చేశారు.

జి.ఓ. 103తో విస్తృత అవకాశాలు

అక్రిడిటేషన్ కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం ముందుగా జి.ఓ. 252ను జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. అనంతరం జర్నలిస్టు సంఘాల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన మార్పులతో జి.ఓ. 103ను విడుదల చేసినట్లు వెల్లడించారు. ఈ సవరణలతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 44,706 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు పొందే అవకాశం కల్పించినట్లు తెలిపారు. గతంలో సుమారు 23 వేల మందికి మాత్రమే అక్రిడిటేషన్ కార్డులు ఉండగా, తాజా నిర్ణయంతో దాదాపు 21 వేలకుపైగా కొత్త కార్డులు అదనంగా మంజూరు కానున్నట్లు మంత్రి వివరించారు. దీంతో జిల్లాలు, మండలాలు, నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరనుంది.

అన్ని మీడియా విభాగాలకు ప్రాధాన్యం

ప్రింట్ మీడియా విభాగంలో 2.50 లక్షలకుపైగా సర్క్యులేషన్ ఉన్న 8 పత్రికలకు 6,256 కార్డులు, 75 వేల నుంచి 2.50 లక్షల వరకు సర్క్యులేషన్ ఉన్న 24 పత్రికలకు 17,784 కార్డులు కేటాయించారు. అలాగే 25,001 నుంచి 75 వేల వరకు సర్క్యులేషన్ ఉన్న 30 పత్రికలకు 3,390, 15,001 నుంచి 25 వేల వరకు సర్క్యులేషన్ ఉన్న 169 చిన్న పత్రికలకు 11,661 కార్డులు మంజూరు చేశారు. 15 వేలలోపు సర్క్యులేషన్ ఉన్న 113 పత్రికలకు 226, పీరియాడికల్స్‌కు 624, 20 న్యూస్ ఏజెన్సీలకు 68 అక్రిడిటేషన్ కార్డులు కేటాయించారు. ఎలక్ట్రానిక్ మీడియా విభాగంలో 21 శాటిలైట్ ఛానళ్లకు 4,431 కార్డులు, 8 జాతీయ ఛానళ్లకు 32, 100 లోకల్ కేబుల్ ఛానళ్లకు 200 కార్డులు కేటాయించారు. డిజిటల్ మీడియా విభాగానికి కూడా 10 అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేశారు. మొత్తం కార్డుల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో 16,056 కార్డులు, నియోజకవర్గ, మండల స్థాయిలో 28,650 కార్డులు ఇవ్వనున్నారు. అక్రిడిటేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని మంత్రి తెలిపారు. అవసరాన్ని బట్టి మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభమైన మీడియా ప్రతినిధుల గౌరవం, భద్రత, సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

Alli Prashanth kumar భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్