సమాజంలో సౌభ్రాతృత్వం పెంపొందించేందుకు కృషి చేయాలి
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
ఘనంగా మహాత్మా శ్రీ బసవేశ్వర జయంతి వేడుకలు
సూర్యపేట, 20 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- బసవేశ్వరుడి ఆశయాలను అనుసరించి సమాజంలో సౌభ్రాతృత్వం పెంపొందించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. సోమవారం, సద్దుల చెరువు (మినీ ట్యాంక్ బండ్) వద్ద వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా శ్రీ బసవేశ్వర జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహాత్మా బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో సమాజంలో ఉన్న కుల వ్యవస్థ, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి సమానత్వం, న్యాయం, ధర్మం వంటి విలువలను ప్రచారం చేసిన మహనీయుడు అని కొనియాడారు. నేటి సమాజంలో చదువు గొప్పతనాన్ని గుర్తించి ప్రజల్లోకి చదువు తీసుకెళ్లాలన్న ఆలోచనతో పాటల, రచనల ద్వారా చైతన్యం కలిగించారన్నారు. ఆయన ఆలోచనలు నేటి సమాజానికి మార్గదర్శకమని తెలిపారు. లింగ, బలిజ కమ్యూనిటీ కోసం అవసరమైన భూమిని కేటాయించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.
మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత మాట్లాడుతూ మనుషులంతా ఒక్కటేనని, కులాలు, ఉపకులాలు లేవన్న మహాత్మా బసవేశ్వరుని సందేశం ఆచరణీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ బసవేశ్వరుని ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. అనంతరం అధికారులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, కార్యదర్శులు, అధ్యక్షులు, తదితరులు ఆయన చిత్రపటానికి అంజలి ఘటించి, నివాళులు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఏఐసిసి సభ్యులు సర్వోత్తమ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి నరసింహ, తహసీల్దార్ కృష్ణయ్య, మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, పిసిసి ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, టీఎన్జీవోస్ జిల్లా సెక్రెటరీ దున్న శ్యామ్,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజద్ అలి, మున్సిపల్ కౌన్సిలర్లు, వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం అధ్యక్షుడు వళ్లెం శేఖర్, వీరశైవ లింగాయత్ లింగ బలిజ కులస్తులు, బిసి వెల్ఫేర్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.