రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు
జోగులాంబ గద్వాల 1 మే 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఇటిక్యాల. ఈ రోజు అనగా మే 1వ తేదీ 2026 శుక్రవారం ఇటిక్యాల గ్రామంలో ' రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇటిక్యాల సర్పంచు జీవేందర రెడ్డి రైతులు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వ్యవసాయం లాభసాటిగా మారాలంటే శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం అవసరమని అన్నారు.
ఈ సందర్భంగా KVK పాలెం వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డా. ప్రశాంత్ మాట్లాడుతూ సేంద్రీయ వ్యవసాయం, సిఫారసు చేసిన మేరకు ఎరువుల వినియోగం, పంట మార్పిడి, సాగునీటి పొదుపు వంటి అంశాలపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. రైతులు శాస్త్రవేత్తల సూచనలను పాటిస్తే దిగుబడులు పెరగడంతో పాటు సాగు వ్యయాలు కూడా తగ్గుతాయని పేర్కొన్నారు. రైతులు రాబోయే వానాకాల పంట సాగుకు ముందస్తుగా సిద్ధం కావాలని సూచించారు. సేంద్రీయ వ్యవసాయం ప్రాముఖ్యతను రైతులకు వివరించి, భూమి ఆరోగ్యం కాపాడుకోవాలంటే సహజ పద్ధతుల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.
ప్రోగ్రామ్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మార్కెట్లో గిరాకీ ఉన్న పంటలను ఎంపిక చేసుకొని సాగు చేస్తే రైతులు అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. భూసార పరీక్షల ప్రాముఖ్యతను వివరిస్తూ, పంట సాగులో సుస్థిరత సాధించాలంటే నేల స్వభావానికి అనుగుణంగా ఎరువుల వినియోగం అవసరమని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రవి, వ్యవసాయ విస్తరణాధికారులు శ్రీకాంత్, సంధ్య రాణి, కవిత రాణి రైతులు పాల్గొన్నారు